Siddaramaiah: భారతీయ జనతా పార్టీ(bjp)పై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ (Operation Lotus) చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
‘గత ఏడాది కాలంగా బీజేపీ నా (కాంగ్రెస్) ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసింది. అయితే, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. మా ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా పార్టీని వీడరు. నా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేస్తుంది’ అని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.
అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో తమకు 400పైగా సీట్లు వస్తాయంటూ బీజేపీ చేస్తున్న ప్రచారంపై కూడా సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్డీయేకు తగినన్ని సీట్లు రావని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా విపక్ష ‘ఇండియా’ కూటమికి పూర్తి మెజారిటీ రాకపోవచ్చన్నారు. కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీ 15 నుంచి 20 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.