Shots Fired : ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య 2023 జూన్ లో అనుమానాస్పద స్థితిలో జరిగింది. ఆ హత్య చేసిందెవరో ఇప్పటికీ తేలలేదు. ఈనేపథ్యంలో తాజాగా ఇప్పుడు కెనడాలోని సౌత్ సర్రే పట్టణంలో నివసించే ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ స్నేహితుడు సిమ్రంజీత్ సింగ్ ఇంట్లో కాల్పులు కలకలం రేపాయి. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగం వెల్లడించింది. సౌత్ సర్రేలోని 154 స్ట్రీట్లో ఉన్న 2800 బ్లాక్కు సమీపంలో సిమ్రంజీత్ సింగ్ నివాసం ఉంది. ఈ ఇంటి పరిసరాల్లో నివసించే వారితో మాట్లాడి.. కాల్పుల వివరాలను పోలీసులు సేకరించారు. స్థానిక సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా జల్లెడ పడుతున్నారు. ఈ కాల్పుల్లో సిమ్రంజీత్ సింగ్ ఇంట్లోని ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. దుండగుల కాల్పుల్లో(Shots Fired) సిమ్రంజీత్ సింగ్ కారు బాగా దెబ్బతిందని గుర్తించారు.ఇంట్లోకి ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయనే తెలియాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join
2023 జూన్లో సౌత్ సర్రే పట్టణంలోనే జరిగిన సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య జరిగింది. ఇందులో భారత ప్రభుత్వానికి చెందిన రహస్య గూఢచారుల హస్తం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈవిషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ప్రతీచోటా చెబుతూ వస్తున్నారు. ఈవిషయంలో దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని కూడా ఆయన ఎన్నోసార్లు చెప్పారు. తమకు సహకరించేలా భారత్పై ఒత్తిడి పెంచాలని అమెరికా, బ్రిటన్లకు కెనడా ప్రధానమంత్రి చాలాసార్లు రిక్వెస్టులు చేశారు. దానివల్లే గతేడాది ఏకంగా అమెరికా నిఘా విభాగం సీఐఏ చీఫ్ కూడా భారత్లో పర్యటించారు. ఆయన భారత నిఘా సంస్థ రా ఉన్నతాధికారులతోనూ భేటీ అయి కెనడాలో నిజ్జర్ హత్య అంశంపై చర్చించారు. కెనడాకు దర్యాప్తులో సహకరించాలని భారత్ను కోరారు. అయినా భారత్ వెరవలేదు. ఆ హత్యలో తమ దేశపు గూఢచారుల పాత్రలేదని స్పష్టం చేసింది.
పంజాబ్లోని ఫగ్వారాలో ఒళ్లు గగుర్పొడిచే హత్యా ఘటన ఇటీవల చోటుచేసుకుంది. శ్రీ చౌరా ఖూహ్ సాహిబ్ గురుద్వారా వద్ద ఒక యువకుడిని నిహాగ్ సిక్కు ఒకరు దారుణంగా హత్య చేశాడు. మతదూషణకు పాల్పడమే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు. ఘటనకు కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సాంపదాయబద్ధమైన తల్వార్లను ధరించే వారిని నిహాంగ్ సిక్కులని అంటారు. గత ఏడాది నవంబర్లో కపుర్తలా జిల్లాలో నిహాంగ్ సిక్కులు కొందరు కాల్పులు జరపడంతో ఒక పోలీసు కానిస్టేబుల్ మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కపుర్తాలాలోని శ్రీ అకల్ బుంగ గురుద్వారా ఆక్రమణకు సంబంధించిన కేసులో కొందరు నిహాంగ్లను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లినప్పుడు ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.