మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ తలపై పసుపు చల్లి నిరసన తెలిపారు. ధనకర్ సామాజికవర్గాన్ని షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. షోలాపూర్ జిల్లాలోని విశ్రాంతి గృహంలో మంత్రిని సంఘ సభ్యులు కలుస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
మంత్రి వినతిపత్రం చదువుతుండగా, ఓ వ్యక్తి తన జేబులోంచి పేపర్లో చుట్టిన పసుపు పొడిని తీసి మంత్రి తలపై చల్లాడు. దీంతో మంత్రి ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే మంత్రి భద్రతా సిబ్బంది, కొందరు పార్టీ కార్యకర్తలు పసుపు చల్లిన వ్యక్తిని పట్టుకుని కొట్టారు. దీనికి సంబంధించిన ఫుటేజీని విడుదల చేశారు. ఆ తర్వాత నిరసన తెలిపిన వ్యక్తి శేఖర్ బంగాలే అని గుర్తించారు.
తమ సంఘం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా చేశానన్నారు. డిమాండ్ను అంగీకరించకుంటే ముఖ్యమంత్రిపైనా, ఇతర మంత్రులపైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. అనంతరం నిరసన తెలిపిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి తెలిపారు. పార్టీ కార్యకర్తలను కొట్టాలని తాను అడగలేదని, అయితే ఘటనను చూసిన వెంటనే స్పందించారని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: IND Vs PAK: భారత్, పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి, ACC కీలక నిర్ణయం!