New Name & Symbol : గడియారం గుర్తు.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరు.. రెండింటినీ శరద్ పవార్ కోల్పోయారు. అవి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి దక్కాయి. ఈనేపథ్యంలో పార్టీకి కొత్త పేరు, కొత్త గుర్తును వెతుక్కునే పనిలో శరద్ పవార్ పడ్డారు. దీనిపై ఇవాళ సాయంత్రంలోగా శరద్ పవార్ ఒక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి 27న మహారాష్ట్రలోని 6 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో బుధవారం సాయంత్రం 4 గంటలలోగా పార్టీకి కొత్త పేరు, కొత్త గుర్తులను(New Name & Symbol) క్లెయిమ్ చేసుకోవాలని శరద్ పవార్ వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈవిషయంలో 3 ప్రాధాన్యతలతో కొత్తగా పేర్లు, గుర్తుల ఎంపికపై నివేదికను అందించాలని శరద్ పవార్ అండ్ టీమ్ను ఆదేశించింది. కొత్తగా ఎంపిక చేసే పార్టీ పేరులో “నేషనలిస్ట్”, “కాంగ్రెస్” అనే పదాలు ఉండేలా చూడాలని శరద్ పవార్ భావిస్తున్నారు. ‘‘ఉదయించే సూర్యుడు’’, ‘‘చక్రం’’, ‘‘ట్రాక్టర్’’లలో ఏదైనా ఒకదాన్ని పార్టీ గుర్తుగా సెలక్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక తమ పార్టీ గుర్తు, పేరును అజిత్ పవార్ వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కట్టబెట్టడంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని శరద్ పవార్ వర్గం అంటోంది.
We’re now on WhatsApp. Click to Join
తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో.. శరద్ పవార్ కనీసం నాలుగు వేర్వేరు ఎన్నికల గుర్తులపై ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్సీపీని ఏర్పాటు చేయడానికి ముందు.. ఎద్దుల జత, చరఖా (స్పిన్నింగ్ వీల్), ఆవు దూడ, చేతి గడియారం గుర్తులపై శరద్ పవార్ పోటీచేశారు.తొలుత కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత కాంగ్రెస్ (ఆర్), కాంగ్రెస్ (యూ), కాంగ్రెస్ (సోషలిస్ట్), కాంగ్రెస్ (ఐ) వంటి పార్టీలలో ఆయన పనిచేశారు. ఇక శరద్ పవార్, అజిత్ పవార్ గ్రూపులకు చెందిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లలో ఇంకా తీర్పు వెలువడలేదు. ఈ కేసులో విచారణ జనవరి 31న ముగిసి, ఫిబ్రవరి 15లోగా తీర్పు వెలువడే ఛాన్స్ ఉంది.
గతేడాది అజిత్ పవార్, శరద్ పవార్పై తిరుగుబాటు చేసి ఎన్సీపీని రెండుగా చీల్చారు. కీలకమైన నేతలు, మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గానికి మద్దతుగా నిలిచారు. మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన ప్రభుత్వం ఎన్సీపీ కూడా చేరి ఎన్డీయే కూటమిలో మిత్రపక్షమైంది. అయితే, శరద్ పవార్ మాత్రం కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ ఇతర పార్టీలతో కూడిన ఇండియా కూటమిలో భాగంగా ఉన్నారు. ఇరు వర్గాలు తమదే నిజమైన ఎన్సీపీ అని, ఎన్నికల గుర్తు కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. శాసనసభలో ఎక్కువ మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గంలోనే ఉన్నారు. దీంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.