చైనా దేశాన్ని కరోనా షేక్ చేస్తోంది. మొత్తం 26 నగరాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒక రిపోర్ట్ ప్రకారం చైనాలోని 26 నగరాలకు చెందిన దాదాపు 21 కోట్ల మంది సంపూర్ణ లేదా పాక్షిక లాక్ డౌన్ లో ఉన్నారు. నెల రోజులుగా ఆ దేశ ప్రజలు లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ అదుపులోకి రాలేదు. చైనా మొత్తం జీడీపీలో 22 శాతాన్ని ఆ 26 నగరాలు అందిస్తున్నాయి. కరోనా కారణంగా చైనా జీడీపీ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. చైనాలో ఇప్పటి వరకు 2,17,836 కరోనా కేసులు నమోదు కాగా… 5,112 మంది మృతి చెందారు.
కరోనా మహమ్మారి చైనా దేశాన్ని అనూహ్యంగా వణికిస్తోంది. నాలుగో వేవ్ వస్తుందేమోనని ఆ దేశ ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఆ దేశంలో కొత్తగా మరో 6,074 కేసులు నమోదయ్యాయి. కరోనా నిర్ధారణ అయిన వారిలో 384 మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించగా, మిగిలిన వారిలో కొన్ని లక్షణాలు ఉండటం గమనార్హం. అయితే ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. మరోవైపు కరోనా కారణంగా 20 మంది చనిపోగా మృతులందరూ కూడా షాంఘై ఫైనాన్షియల్ హబ్ కు చెందిన వారే కావడం గమనార్హం. షాంఘైలోని 2.6 కోట్ల మంది ప్రజలు నెలకు పైగా ఇళ్లకే పరిమితమయ్యారు.