INDIA bloc : మహారాష్ట్రలో ‘ఇండియా’ కూటమిలోని విపక్ష పార్టీల సంయుక్త వేదిక పేరు ‘మహా వికాస్ అఘాడీ’ !! ఎన్నికలు సమీపించిన వేళ ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిలో చీలిక ఏర్పడింది. ఇందులో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరత్ చంద్రపవార్) వర్గం, వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే లోక్సభ సీట్ల పంపకంలో ఈ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. సీట్ల పంపకాలు ఖరారు కాకముందే శివసేన(ఉద్ధవ్) 16 మంది లోక్సభ అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వెళ్లగక్కారు. రాష్ట్రంలో తమకు ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై సౌత్ లోక్సభ సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసిన వాటిలోని మూడు స్థానాల్లోనూ ఉద్దవ్ వర్గం శివసేన అభ్యర్థులను ప్రకటించడం చర్చకు దారితీసింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ పరిణామాల నేపథ్యంలో ఎంవీఏ కూటమిలోని(INDIA bloc) వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. తమ పార్టీకి చెందిన 8 మంది అభ్యర్థుల పేర్లను వీబీఏ చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ అనౌన్స్ చేశారు. సీట్ల పంపకాలపై క్లారిటీ రాకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఎంవీఏ కూటమిపై ప్రకాష్ అంబేద్కర్ విమర్శలు గుప్పించారు. రాజవంశ రాజకీయాలను కాపాడుకోవడానికి ఎంవీఏ కూటమి తమ పార్టీని వాడుకుందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలకు సీటు షేరింగ్ ఫార్ములాను ఖరారు చేయడంలో ఎంవీఏ కూటమి తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. కాగా, 2019 లోక్సభ పోల్స్లో శివసేన 48 స్థానాలలో పోటీచేసి 22 గెల్చుకుంది.