గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర వీవీఐపీలపై ఉగ్రమూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోడీతో పాటు ఇతర ప్రముఖులను ఉగ్రవాదులు టార్గెట్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు నిఘావర్గాలు పసిగట్టాయి.ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలు కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ – నాయకులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు వచ్చిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమూహాలు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని, బహిరంగ సభలు, కీలకమైన సంస్థలు, రద్దీగా ఉండే ప్రదేశాలను విధ్వంసం, అంతరాయం కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఉగ్రమూకలు డ్రోన్లను ఉపయోగించి కూడా దాడులకు ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు నిఘవర్గాలకు సమాచారం అందింది.
లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి తీవ్రవాద గ్రూపులు ఈ ఉగ్ర ముప్పు వెనుక ఉన్నట్టు నిఘావర్గాలకు ఉన్న సమాచారం. పాకిస్తాన్లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్లో మిలిటెన్సీని పునరుద్ధరింపజేసేందుకు, పునరుజ్జీవింపజేసేందుకు క్యాడర్లను కూడా సమీకరించుకుంటున్నాయి. పంజాబ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షిత దాడులకు ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 2021లో అందిన ఇన్పుట్స్ ప్రకారం ఖలిస్తానీ టెర్రర్ గ్రూపులు ప్రధానమంత్రి సమావేశాలు, పర్యటన వేదికలపై దాడికి ప్లాన్ చేస్తున్నాయి.