Corona Cases: భయపెడుతున్న కరోనా.. తాజా కేసులు 774 నమోదు

  • Written By:
  • Updated On - January 6, 2024 / 09:08 PM IST

Corona Cases: కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్పా ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి . తాజాగా ఒకేరోజులో 774 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం 4187కు చేరింది. గత 24 గంటల్లో తమిళనాడు, గుజరాత్‌ల్లో ఒక్కొకరు వంతున ఇద్దరు చనిపోయారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య 5,33,387 కు పెరిగింది.

ఈనెల 5 వరకు రెండంకెల్లోనే ఉండే కేసులు ఆ తరువాత నుంచి శీతల వాతావరణం, కొవిడ్ సబ్ వేరియంట్ జెఎన్.1 వ్యాపించడంతో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. డిసెంబర్ 5 తరువాత డిసెంబర్ 31న అత్యధికంగా 841 కేసులు నమోదై 2021 మే కంటే 0.21 శాతం ఎక్కువగా నమోదు కనిపించింది. 4187 క్రియాశీల కేసుల్లో 92 శాతం ఇంటివద్ద ఐసొలేషన్ వల్లనే కోలుకోవడమైంది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,79,804కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

రికవరీ రేటు 98.81శాతం కాగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైనట్టు పేర్కొంది. ఇక ఇప్పటివరకు 220.67 కోట్ల వాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించింది. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సబ్‌వేరియంట్ జెఎన్.1 కేసులు 619 నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 199, కేరళలో 148 , మహారాష్ట్రలో 110 కేసులు బయటపడ్డాయి. వాతావరణ కారణంగా కేసులు పెరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు.

ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు వైరస్ జిల్లాలకు కూడా వ్యాపించింది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తుంది. రెండు జిల్లాల్లో ఆరు పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో… మహబూబ్ నగర్ జిల్లాలో రెండు కేసులు వెలుగు చూశాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ ప్రభుత్వం అప్రమత్తమయింది.

కరోనా నిబంధనలు పాటిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, పలు అనారోగ్యాలతో బాధపడేవారు ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ తదితర వ్యాధులతోపాటు రక్తపోటు, మధుమేహం ఉన్నవారు.. 50 ఏళ్లు దాటినవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు కేరళలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో.. శబరిమల వెళ్లి వచ్చిన భక్తులకు టెస్టులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.