Sanatan Dharma – Supreme Court : సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసినందుకుగానూ పలుచోట్ల ఉదయనిధిపై కేసులు కూడా నమోదయ్యాయి. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. తమిళనాడులో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలను రాజ్యాంగ విరుద్ధ చర్యలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చెన్నైకు చెందిన ఒక న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఈరోజు తమిళనాడు ప్రభుత్వం, ఉదయనిధి స్టాలిన్ లకు నోటీసులను ఇష్యూచేసింది. మరో డీఎంకే నేత ఏ.రాజా, సీబీఐ సహా ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా ప్రస్తావించిన వారందరికీ ఈ నోటీసులు జారీ అయ్యాయి. డీఎంకే నేత ఏ.రాజా కూడా సనాతన ధర్మంపై, హిందూయిజంపై, ప్రధాని మోడీపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. అందుకే ఆయనకూ నోటీసులు జారీ చేశారు.
అయితే ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా.. ఉదయనిధి వ్యాఖ్యలను ద్వేషపూరిత ప్రసంగంగా పరిగణించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.సనాతన ధర్మంపై వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఉదయనిధిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే పిటిషనర్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ద్వేషపూరిత ప్రసంగాలపై పెండింగ్లో ఉన్న ఇతర పిటిషన్లతో కలిపి ఈ కేసును కూడా విచారిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు (Sanatan Dharma – Supreme Court) చేశారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.