141 MPs Suspended : పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేదికగా రాజ్యసభ, లోక్సభల నుంచి ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతోంది. డిసెంబరు 13న లోక్సభలో చోటుచేసుకున్న భద్రతా ఉల్లంఘనపై నిరసనలు తెలిపినందుకు మరో 49 మంది లోక్సభ ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంటు సెషన్ మొదలైనప్పటి నుంచి సోమవారం వరకు ఉభయ సభల నుంచి 92 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా.. తాజాగా మంగళవారం రోజు 49 మంది సస్పెన్షన్కు గురయ్యారు. దీంతో ఈ సెషన్లో ఇప్పటిదాకా సస్పెండ్ అయిన ఉభయ సభల ఎంపీల సంఖ్య 141కి పెరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటివరకు సస్పెండ్ అయిన మొత్తం 141 మంది ఎంపీలలో 95 మంది లోక్సభ సభ్యులు కాగా, మరో 46 మంది(141 MPs Suspended) రాజ్యసభ సభ్యులు. ఈ పరిణామాలతో ప్రతిపక్ష ఇండియా కూటమి బలం రాజ్యసభలో సగానికి సగం తగ్గిపోగా, లోక్సభలో మూడింట ఒక వంతుకు తగ్గిపోయింది. ఇవాళ లోక్సభ నుంచి సస్పెండ్ అయిన ప్రముఖుల్లో ఫరూక్ అబ్దుల్లా, శశిథరూర్, మనీష్ తివారీ తదితరులు ఉన్నారు. ప్రతిపక్ష నేతల నిరసనల కారణంగా లోక్సభ, రాజ్యసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇక సస్పెండ్ అయిన ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు భవనంలోని మకర ద్వారం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈసందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ను అనుకరించారు.