Kinjarapu Rammohan Naidu మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, సరైన వెలుతురు లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలిందని అన్నారు.
విమానయాన నిపుణుడు, మాజీ ఎయిరిండియా పైలట్ మినూ వాడియా ఈ ప్రమాదంపై స్పందిస్తూ, సరైన వెలుతురు లేకపోవడం వల్లే పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం అడిగారని అన్నారు. వెలుతురు సరిగా లేకపోవడంతో మొదటిసారి ఆయన ల్యాండింగ్కు ప్రయత్నించి విఫలమయ్యాడని, రెండో ప్రయత్నంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం కూలిపోయిందని తెలిపారు.
అయితే, ఈ ప్రమాదంపై మరిన్ని ఆధారాలు లభించే వరకు వేచి చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం అడిగినట్లు తెలుస్తోందని, కానీ ఎందుకనేది విచారణలో తేలుతుందని అన్నారు. ఇంజిన్లో సమస్య లేదని అభిప్రాయపడ్డారు. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా విమానం ల్యాండ్ అవడానికి మరో ఇంజిన్తో సురక్షితంగా పైలట్ ల్యాండ్ చేయగలడని అన్నారు.
