Mysterious Disease: జమ్మూకశ్మీర్లోని రాజౌరీలోని బాదల్ గ్రామంలో అనుమానాస్పద మరణాలకు (Mysterious Disease) కారణం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో జరుగుతున్న రహస్య మరణాలకు కారణం ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదా వైరస్ కాదు అని తేలింది. కాడ్మియం అనే టాక్సిన్ ఈ మరణాలకు కారణమని సమాచారం. ఈ సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వయంగా తెలిపారు.
లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ శాస్త్రవేత్త ఈ విషయానికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేశారని, అందులో మృతుల శరీరంలో కాడ్మియం అనే టాక్సిన్ ఉన్నట్లు చెప్పారని ఆయన చెప్పారు.
టాక్సికాలజీ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్
లక్నోలోని టాక్సికాలజీ ల్యాబ్ పరీక్ష నివేదికలో మృతుల శరీరాల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్, వైరస్ లేదా బ్యాక్టీరియా కనిపించలేదని నిర్ధారించినట్లు మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వీరంతా కాడ్మియం అనే టాక్సిన్ ద్వారా మరణించినట్లు ఆయన తెలిపారు. మరణించిన వారి మృతదేహాలలో ఇది ఎక్కడ నుండి వచ్చిందో ఇంకా తెలియలేదని ఆయన వివరణ ఇచ్చారు. దీనిపై పోలీసులు విచారణ చేయనున్నారు. మరణించిన వారి శరీరంలోకి విషం ఎలా చేరిందో పోలీసుల విచారణలో తేటతెల్లం కావచ్చని మంత్రి అన్నారు.
ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు
గత ఏడాది డిసెంబర్ 7 నుండి రాజౌరి జిల్లాలోని బాదల్ గ్రామంలో 13 మంది పిల్లలతో సహా 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ మరణాలన్నీ గ్రామంలోని 3 కుటుంబాలలో మాత్రమే సంభవించాయి. వారితో సంబంధం ఉన్న మరో 38 మంది కూడా టాక్సిన్ బారిన పడ్డారు. తాజాగా బాదల్ గ్రామంలో 11 ఏళ్ల బాలిక అస్వస్థతకు గురైంది. ఆమెను జిఎంసి రాజౌరిలో చేర్చారు. బాలికతోపాఉట అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు సోదరీమణులు అనారోగ్యంతో జమ్మూలో చికిత్స పొందుతున్నారు.
బాదల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు
ఈ ఘటనతో బాదల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇప్పటివరకు చనిపోయిన, అనారోగ్యంతో ఉన్న వారితో పరిచయం ఉన్న సుమారు 200 మంది గ్రామస్తులను క్వారంటైన్ కేంద్రానికి పంపారు. ఇదే సమయంలో దీనిపై దర్యాప్తు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది. ఈ బృందం 3 రోజుల పాటు బాదల్ గ్రామంలో పర్యటించింది. మరణాలకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ఆ బృందం 230 కంటే ఎక్కువ నమూనాలను తీసుకున్నారు. ఇదిలా ఉండగా మృతుల శరీరాల్లో న్యూరోటాక్సిన్ (విషం) కనిపించడంతో పోలీసులు దర్యాప్తు చేయడానికి సిట్ను కూడా ఏర్పాటు చేశారు.