India Win : దౌత్యంలో భారత్ మరో విజయం సాధించింది. ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలపై ఖతర్ జైల్లో మగ్గుతున్న ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులకు ఎట్టకేలకు కటకటాల నుంచి విముక్తి లభించింది. భారత్ దౌత్య ప్రయత్నాలు సఫలం కావడంతో ఖతర్ ప్రభుత్వం ఆ ఎనిమిది మందిని జైలు నుంచి రిలీజ్ చేసింది. భారత విదేశాంగ శాఖ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. విడుదలైన 8 మందిలో ఏడుగురు ఇప్పటికే ఇండియాకు తిరిగొచ్చేశారని వెల్లడించింది. భారత నేవీ వెటరన్లపై వారి కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఖతర్ రాజు నిర్ణయం అభినందనీయం : భారత్
‘‘ఖతర్ జైలు నుంచి ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఆ ఎనిమిది మందిలో ఏడుగురు భారతదేశానికి ఇప్పటికే తిరిగి వచ్చారు. ఖతర్ రాజు నిర్ణయాన్ని మేం అభినందిస్తున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రధాని మోడీ వల్లే రిలీజయ్యాం
- ‘‘మేం సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా మేం ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆయన వ్యక్తిగత జోక్యం వల్ల మాత్రమే సాధ్యమైంది’’ అని ఖతర్ జైలు నుంచి విడుదలైన భాత మాజీ నేవీ అధికారి ఒకరు చెప్పారు.
- ‘‘మేం భారతదేశానికి తిరిగి రావడానికి దాదాపు 18 నెలలు వేచి ఉన్నాం. మేం ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆయన వ్యక్తిగత జోక్యం, ఖతర్తో ఆయన దౌత్యం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు” అని ఖతర్ జైలు నుంచి విడుదలైన మరో భారతీయుడు తెలిపారు.
అసలేం జరిగింది ? ఏమిటీ కేసు ?
- గల్ఫ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే అల్ దహ్రా అనే కంపెనీలో మన దేశానికి చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులు ఉద్యోగాల్లో చేరారు. ఆ కంపెనీ తరఫున ఖతర్ దేశ నేవీకి ఔట్ సోర్సింగ్ సేవలను అందించారు.
- ఇటలీ నుంచి ఖతర్ కొనుగోలు చేసిన U212 స్టెల్త్ జలాంతర్గాముల నిర్వహణ, మోహరింపుపై ఖతర్ నేవీకి భారత మాజీ నేవీ అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు.
- ఈక్రమంలోనే ఆ జలాంతర్గాములకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇజ్రాయెల్కు చేరవేశారనే అభియోగాలతో 8 మంది భారత మాజీ నేవీ ఆఫీసర్లను ఖతర్ పోలీసులు 2022 ఆగస్టులో అదుపులోకి తీసుకుంటారు.
- అరెస్టయిన జాబితాలో కెప్టెన్ నవ్తేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమేండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగునాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా ఉన్నారు.
- వీరందరికీ 2023 అక్టోబర్ 26న ఖతర్ కోర్టు మరణ శిక్ష విధించింది.
- ఈ క్రమంలో రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం కోర్టులో అప్పీలు దాఖలు చేసింది.
- దీనిపై విచారించిన ఖతర్ న్యాయస్థానం.. 2023 డిసెంబరులో భారత నేవీ మాజీ అధికారుల మరణ శిక్షను జైలు శిక్షగా మార్చింది.
- భారత్ దౌత్యాన్ని పెంచడంతో.. ఖతర్ రాజుతో చర్చలు జరపడంతో.. ఎట్టకేలకు 8 మంది భారత మాజీ నేవీ అధికారులను విడుదల చేసింది. దీంతో వీరంతా 18 నెలల జైలుశిక్ష తర్వాత రిలీజ్ అయ్యారు.