గత ఎన్నికల ముందుగా జరిగిన పూల్వామా ఉగ్రదాడిపై(Pulwama Truth) అనుమానాలు వ్యక్తం చేస్తూ జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal malik) మరోసారి సంచలన కామెంట్లు చేశారు. వాటిని సమర్థిస్తూ 2019 ఎన్నికల్లో విజయం కోసం పూల్వామాదాడి జరిగిందా? అంటూ శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ నిలదీశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేయడం సంచలనం కలిగిస్తోంది. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు దారితీసిన లోపాలను ఒక ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ నాగపూర్ వేదికగా వెలుగెత్తారు. వాటిని సంజయ్ రౌతు ఎలివేట్ చేస్తూ మోడీ సర్కార్ ను దుయ్యబట్టారు.
జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా(Pulwama Truth) జిల్లాలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై 2019 ఫిబ్రవరిలో పేలుడు పదార్థాలతో కూడిన కారు రూపంలో ఆత్మాహుతి బాంబర్ ఢీకొట్టింది. ఫలితంగా 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఆ ఘటనపై మాలిక్ (Satyapal Malik)మాట్లాడుతూ రక్షణ సిబ్బందిని తీసుకెళ్లేందుకు సీఆర్పీఎఫ్ విమానాలను కోరిందని తెలియచేశారు. ఎందుకంటే 2,500 మంది సిబ్బందిని 78 వాహనాలతో రోడ్డు మార్గంలో ప్రయాణించడం మంచిదికాదని భావించిందని పేర్కొన్నారు. కానీ, రోడ్డు మార్గంలో ప్రయాణించేలా చేసిన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఆరోజు నిలదీశాయని గుర్తు చేశారు. కానీ, బీజేపీ సర్కార్ విపక్షాల మీద దేశ ద్రోహులు అంటూ పాకిస్తాన్ వాయిస్ వినిపిస్తున్నారని ఆరోపిస్తూ ఘటనపై నిజాలను బయట పెట్టకుండా మౌనం వహించిందని అన్నారు.
పుల్వామా పేలుడు(Pulwama Truth) కంటే భయంకరమైన నిజాన్ని మాలిక్ (Satyapal Malik)బయటకు తీసుకొచ్చాడని సంజయ్ రౌత్ సంచలన కామెంట్లు చేశారు. `ఇండో-పాకిస్తాన్ సంఘటనలు రాజకీయ లబ్ధి కోసం తయారు చేయబడతాయని ప్రజలకు తెలుసు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగిందా? రాజకీయ లబ్ధి కోసం 40 మంది జవాన్లను హతమార్చేందుకు కుట్ర జరిగిందా? ఆ సమయంలో ప్రతిపక్షం పదే పదే ఇలాంటి ప్రశ్నలను అడగడానికి ప్రయత్నించాం. కానీ అధికార పార్టీ మౌనం వహించింది. అంతేకాదు , విపక్షంపై ‘ద్రోహులు’ అని ముద్రవేయబడింది. ”అని రాజ్యసభ ఎంపీ రౌత్ అన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఆర్డీఎక్స్ పుల్వామాకు ఎలా చేరిందని ప్రశ్నించారు. “సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ పుల్వామా రహదారి వెంట ప్రయాణించరు. ఎందుకు భద్రతాదళం కాన్వాయ్ కు ప్రభుత్వం వైమానిక మద్దతు ఇవ్వలేదు, ”అని థాకరే క్యాంప్ నాయకుడు నిలదీశారు. మోదీ ప్రభుత్వంపై దేశద్రోహం కేసు నమోదు చేయడమే కాకుండా, పుల్వామా ఘటనకు బాధ్యులైన మంత్రులను “కోర్ట్ మార్షల్” చేయాలని రౌత్ డిమాండ్ చేయడం రాజకీయ సంచలనంగా మారింది.
నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లను శిక్షించడంలో మోదీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అలాగే బీజేపీ మిత్రుడు (గౌతమ్ అదానీ)పై విచారణ ప్రారంభించడంపై దాడి చేస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రౌత్ అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)లను ఉపయోగించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)ని విచ్ఛిన్నం చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్పై సీబీఐ నోటీసులు జారీ కాగా, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు ఈడీ, సీబీఐ సమన్లు అందాయి” అని రౌత్ ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోభాల్లపై జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satyapal Malik) చేసిన సంచలన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. సైనికుల తరలింపునకు విమానాలు పంపించమని అడిగినప్పటికీ కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిరాకరించిందని సత్యపాల్ మాలిక్ బాంబు పేల్చారు. పుల్వామా దాడి జరిగినపుడు ప్రధాని తనకు ఫోన్ చేయగా భద్రతా లోపాలను తాను ఎత్తి చూపించానని సత్యపాల్ వెల్లడించారు. పుల్వామా(Pulwama Truth) ఉగ్రదాడి ఘటన గురించి ఏమి మాట్లాడవద్దని తనకు ప్రధాని మోదీ, ఢోబాల్ సూచించారని సత్యపాల్ వెల్లడించారు. ఒక ప్రైవేటు వెబ్ సైట్ కు సత్యపాల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.
సత్యపాల్ మాలిక్ (Satyapal Malik)చేసిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటాయని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 2019 ఫిబ్రవరి నెలలో పుల్వామా ఉగ్ర దాడి ఘటన జరిగినపుడు సత్యపాల్ మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నరుగా ఉన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇంటెలిజెన్స్ వైఫల్యం, కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్లక్ష్యంపై తనను మాట్లాడవద్దని ప్రధాని సూచించారని సత్యపాల్ చెబుతున్నారు. కరణ్ థాపర్ చేసిన ఇంటర్వ్యూలో సత్యపాల్ ఈ ఆరోపణలు చేశారు. బీజేపీ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ అంబానీకి చెందిన రెండు ఫైళ్లను క్లియర్ చేసేందుకు తనకు రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని కూడా సత్యపాల్ ఆరోపించారు. ఈ ఆరోపణలు తప్పు అని, దీనిపై పరువునష్టం కేసు పెడతానని రాంమాధవ్ అన్నారు.
Also Read : Pulwama Attack: దారుణం.. ఉగ్రదాడిలో సెక్యూరిటీ గార్డు మృతి
సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబరు వరకు జమ్మూకశ్మీర్ గవర్నరుగా, 2021 వరకు మేఘాలయ గవర్నరుగా పనిచేశారు. రాంమాధవ్ పై మాజీ గవర్నర్ చేసిన ఆరోపణలపై సీబీఐ,ఈడీ ఎందుకు విచారణ చేపట్టలేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. రాంమాధవ్ ను సీబీఐ ఎందుకు విచారణకు పిలవలేదని పవన్ ఖేరా ప్రశ్నించారు. సీబీఐ ప్రతిపక్ష నేతలను ఇంటరాగేట్ చేస్తూ బీజేపీ నేతలను వదిలేస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని ఆయన విమర్శించారు.మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఇవ్వకుండా కేవలం అతని సొంత ఇంట్లోనే ఉండగా ఓ పీఎస్ఓను నియమించిందని పవన్ ఖేరా చెప్పారు. అదే, గులాంనబీ ఆజాద్ కు ప్రభుత్వ బంగళాతోపాటు జడ్ ప్లస్ కేటగిరి రక్షణ కల్పించిందని పవన్ ఖేరా గుర్తు చేశారు. మొత్తంమీద సత్యపాల్ ప్రధాని మోదీపై చేసిన ఆరోపణలు సంచలనం రేపగా, రౌత్ వాటిని అందుకోవడం రాజకీయ వేడిని పెంచాయి.
Also Read : Pulwama Terror Attack: పుల్వామా ఉగ్రదాడి అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు