Maha Kumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జనవరి 13 నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మహాకుంభమేళాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొననున్నట్లు తెలిసింది. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని ప్రయాగ్రాజ్కు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం మహాకుంభ్ను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రపతి ముర్ము మహాకుంభమేళాకు వెళ్లనున్నట్లు సమాచారం.
ఇక ఫిబ్రవరి 1వ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ సైతం ప్రయాగ్రాజ్ వెళ్లనున్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో అధికారులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈనెల 27న మహాకుంభమేళాకు హాజరుకానున్నట్లు తెలిసింది. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గంగాపూజ నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.
కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో కన్నుల పండువగా మహా కుంభమేళా జరుగుతున్నది. రోజుకు కోటి మందికిపైగా భక్తులు ఈ మహా కుంభమేళాకు తరలివస్తున్నారు. తొలి 8 రోజుల్లోనే 8.81 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాలో పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక..మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం జనవరి 29న జరగనుంది. అయితే దీని కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ కుంభమేళాలో పాల్గొనడం ద్వారా సాధువులు, భక్తులు సహా అనేక మందికి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.
Read Also: World Economic Forum: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. సీఎం రేవంత్ బృందం షెడ్యూల్ ఇదే!