Site icon HashtagU Telugu

Budget session : భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్ పవర్‌ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి

President Droupadi Murmu speech addressing both Houses

President Droupadi Murmu speech addressing both Houses

Budget session : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 3 రెట్ల వేగంతో పనిచేస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా జరిగే సమయంలో ఈ ఏడాది పార్లమెంట్ సమావేశం ప్రారంభించాం.

సైబర్ భద్రతలో సామర్థ్యాన్ని నిరూపించడానికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోంది. డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్, డీప్‌ఫేక్ లాంటివి సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు దేశ భద్రతకు పొంచి ఉన్న సవాళ్లు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. డిజిటల్ ఇండియాగా దేశాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది.

ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్‌లో పేదలు, మహిళలు, రైతులతో పాటు యువతకు అధిక ప్రాధాన్యత ఉండనుంది. పీఎం ఆవాస్ యోజన ద్వారా లక్షల ఇండ్లు నిర్మించి పేదలకు అందించాం. వారి సొంతింటి కలను ఎన్డీయే సర్కార్ నేర్చిందన్నారు. ఇక, రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన తర్వాత ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సర్వే గత సంవత్సరంలో ప్రభుత్వం పనితీరుపై సమగ్ర విశ్లేషణను అందించే వివరణాత్మక రిపోర్ట్‌కార్డ్‌ లాంటిది. ఈ సర్వే జీడీపీ, వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి వంటి వివిధ కీలక విషయాల గురించి వివరిస్తుంది. ఇక రేపు అంటే శనివారం పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తారు.

Read Also: Parliament : ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది : ప్రధాని మోడీ