ప్రధాని మోడీ రెండు రోజుల కర్ణాటక పర్యటన సోమవారం మొదలైంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం, మైసూరు బహిరంగసభతో పాటు అనేక కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. మైసూరు లోని సుత్తూరు మఠంలో వేదపాఠశాలను జాతికి అంకితం చేస్తారు. రైల్వేస్, నేషనల్ హైవే అధారిటీకి చెందిన వివిధ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అగ్నిపథ్ స్కీం పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కర్ణాటక పోలీసులు హై అలర్ట్ అయ్యారు. గతంలో ఎన్నడూలేని రీతిలో మోడీ పర్యటన కారణంగా.. ఏకంగా 75
స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇవన్నీ మోడీ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలోని విద్యా సంస్థలేనని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలను, యువతను ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ విద్యా సంస్థలు మూయించిందని విమర్శిస్తున్నాయి.
ఇప్పుడు ఎందుకీ పర్యటన ?
త్వరలోనే కర్ణాటకలో ఎన్నికలు ఉండటంతో బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నే అధికారంలో ఉన్నా..ఆ పార్టీ ఇప్పుడు పలు సమస్యలు ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. జెడీఎస్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని పర్యటన కారణంగా అధ్వాన్నంగా ఉన్న కొన్ని బెంగుళూరు రోడ్లు కూడా బాగుపడ్డాయి.
పర్యటన షెడ్యూల్..
* సోమవారం మధ్యాహ్నం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి)కు ప్రధాని చేరుకుంటారు. అక్కడ జరిగే రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెయిన్ సెల్ డెవలప్మెంట్ సెంటర్ను మోడీ ప్రారంభిస్తారు.
* అనంతరం ఐటి కంపెనీ మైండ్ట్రీ ఏర్పాటు చేస్తున్న 850 పడకల రీసెర్చ్ హాస్పిటల్కు శంకుస్థాపన చేస్తారు.
* ఆ తర్వాత బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టు శంకుస్థాపన, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ప్రారంభోత్సవం, శంకుస్థాపన నిమిత్తం కొమ్మఘట్టకు వెళ్లనున్నారు.