ప్రధాని మోడీ పాలనపై ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోడీ తిరగబడ్డారు. పెరిగిన నిత్యావసరాల ధరల భారాన్ని సామాన్యులు భరించలేకపోతున్నారని తెలియచేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగారు. ‘పశ్చిమ బెంగాల్ రేషన్ మోడల్’ ఉచిత పంపిణీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం.
ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్(AIFPSDF) వైస్ ప్రెసిడెంట్ గా ప్రహ్లాద్ మోడీ ఉన్నారు. ఆ హోదాలో ఆయన వివిధ డిమాండ్లతో ఢిల్లీలో ధర్నాకు దిగారు. AIFPSDF సభ్యులతో పాటు ప్రహ్లాద్ జంతర్ మంతర్ వద్ద బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తూ గుమిగూడారు. జీవన వ్యయాలు, దుకాణాల నిర్వహణ కోసం ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో మార్జిన్లో కిలోకు కేవలం 20 పైసలు మాత్రమే పెంచడం ఒక క్రూరమైన జోక్ అంటూ విమర్శించారు. ఆర్థిక కష్టాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని ప్రహ్లాద్ అన్నారు.
బుధవారం ఏఐఎఫ్పీఎస్డీఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని, దాని ఆధారంగా తమ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నామని AIFPSDF జాతీయ ప్రధాన కార్యదర్శి బిశ్వంభర్ బసు తెలిపారు. బియ్యం, గోధుమలు, పంచదారపై నష్టపరిహారం చెల్లించాలని, ఎడిబుల్ ఆయిల్, పప్పులు సరసమైన ధరల దుకాణాల ద్వారా సరఫరా చేయాలని AIFPSDF డిమాండ్ చేస్తోంది.
‘పశ్చిమ బెంగాల్ రేషన్ మోడల్’ ఉచిత పంపిణీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది.
జమ్మూ మరియు కాశ్మీర్తో సహా అన్ని రాష్ట్రాలకు బకాయి ఉన్న అన్ని మార్జిన్లను వెంటనే రీయింబర్స్ చేయాలని సభ్యులు అన్నారు.నూనెలు, పప్పులు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను సరసమైన ధరల దుకాణాల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ ఉంచారు. గ్రామీణ ప్రాంతాల సరసమైన ధరల దుకాణం డీలర్లు బియ్యం, గోధుమల కోసం ప్రత్యక్ష సేకరణ ఏజెంట్లుగా పనిచేయడానికి అనుమతించాలని కోరారు.