Train Force One : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైలులో ప్రయాణించడం చాలా అరుదు. ఆయన సాధారణంగా విమానాల్లో మాత్రమే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇటీవలే పోలండ్ నుంచి ఉక్రెయిన్కు భారత ప్రధానమంత్రి ఒక రైలులో వెళ్లారు. ఆ రైలు పేరు.. ‘ట్రైన్ ఫోర్స్ వన్’ . పోలండ్ నుంచి ఉక్రెయిన్కు వెళ్లేందుకు విమానం అందుబాటులో ఉన్నా.. రైలులో వెళ్లడానికే ప్రధాని మోడీ ప్రయారిటీ ఇచ్చారు.ఎందుకలా ? ఈ కథనంలో తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
దాదాపు 20 గంటల పాటు ‘ట్రైన్ ఫోర్స్ వన్'(Train Force One) రైలులో ప్రయాణించి భారత ప్రధాని మోడీ పోలండ్ నుంచి ఉక్రెయిన్కు చేరుకున్నారు. రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్లోని ప్రధాన విమానాశ్రయాలన్నీ మూతపడ్డాయి. రష్యా ఆర్మీ ఉక్రెయిన్ నగరాలపై ఎటు వైపు నుంచి ఏ మిసైల్స్ వేస్తుందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణం వల్లే పోలండ్ నుంచి ‘ట్రైన్ ఫోర్స్ వన్’ రైలులో ప్రధాని మోడీ ఉక్రెయిన్కు చేరుకున్నారు. ఇది బుల్లెట్ ప్రూఫ్ రైలు. ఈ రైలు రాత్రి పూట మాత్రమే నడుస్తుంది. ఇదొక లగ్జరీ రైలు. దీన్ని అత్యాధునిక ఇంటీరియర్తో డిజైన్తో తయారు చేశారు. ఈ రైలులో విలాసవంతమైన క్యాబిన్లు ఉన్నాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు రెస్ట్ తీసుకునేందుకు సౌకర్యవంతమైన బెడ్రూమ్లు ఉన్నాయి. ఈ ట్రైన్ చూడటానికి రైల్వే ట్రాక్పై ప్రయాణిస్తున్న లగ్జరీ హోటల్ను తలపిస్తుంది.
ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో ప్రధాని మోడీ కంటే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, అప్పటి ఇటలీ ప్రధాని ప్రయాణించారు. అప్పటి నుంచి ఈ రైలు పేరు ‘ట్రైన్ ఫోర్స్ వన్’ లేదా ‘రైల్ ఫోర్స్ వన్’గా మారిపోయింది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం మొదలయ్యాక లక్షలాది మంది ఉక్రెయిన్ వాసులను ఈ రైలులోనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.