అమ్మకు మించిన దైవమున్నదా అంటారు పెద్దలు. నిజమే.. ఎన్ని జన్మలెత్తినా సరే.. తల్లి రుణం తీర్చుకోలేం. అందుకే అమ్మను దేవతలా చూసుకోవాలి అంటారు. ప్రధాని మోదీ ఈ మాటను అక్షరసత్యం చేస్తున్నారు. అందుకే తాను ప్రధానిగా ఎంత బిజీగా ఉన్నా సరే.. వీలు చేసుకుని మరీ తన కన్నతల్లిని చూసి వస్తుంటారు. ఆమె పేరు హీరాబెన్ మోదీ. ఆమె ఈనెల 18న వందో సంవత్సరంలోకి అడుగుపెడతారు.
ఈరోజుల్లో నూరేళ్లు జీవించడమంటే అది దేవుడిచ్చిన అదృష్టమే అని చెప్పాలి. ఆరోగ్యకరమైన తిండితోపాటు.. మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా జీవించగలిగితేనే అది సాధ్యమవుతుంది. హీరాబెన్ మోదీకి ఈ రెండు సాధ్యమే. ఆమె 1923 జూన్ 18న జన్మించారు. ఈ మేరకు ఈ వివరాలను ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు పంకజ్ మోదీ చెప్పారు. జూన్ 18న మోదీ గుజరాత్ లోనే ఉంటారు. కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గోవాల్సి ఉంది. ఈ సందర్భంగా గాంధీ నగర్ లో ఉంటున్న తన తల్లికి నూరో పుట్టిన రోజు చేయడంతోపాటు.. ఆమె ఆశీస్సులు తీసుకునే అవకాశం ఉందన్నారు పంకజ్ మోదీ. హీరాబెన్ మోదీ తన కుమారుడు పంకజ్ మోదీతో కలిసి.. గాంధీనగర్ లోని ఇంట్లోనే నివాసముంటున్నారు.
హీరాబెన్ మోదీ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని సకల దేవతలను ప్రార్థిస్తూ.. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయడానికి ఆమె కుటుంబం ప్లాన్ చేసింది. మోదీ స్వస్థలమైన వడ్ నగర్ లోనే ఈ ప్రోగ్రామ్స్ ను చేయబోతోంది మోదీ కుటుంబం.