BRICS Summit : ప్రధాని మోడీ 16వ బ్రిక్స్ సమావేశం కోసం నేడు రష్యాకు వెళ్లారు. రష్యాలోని కజాన్లో సమావేశం జరగుతుంది. రష్యాకి చేరిన ప్రధాని మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. ఈ రోజు బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ఒకరినొకరు కౌగిలించుకుని, పలకరించుకున్నారు. మరిన్ని దేశాలు బ్రిక్స్లో చేరుతున్న సమయంలో, ఈ సదస్సు విజయవంతం కావాలని ప్రధానిమోడీ అభినందనలు తెలిపారు.
ఇరువురు నేతల భేటీలో ఉక్రెయిన్ యుద్ధంపై శాంతియుత పరిష్కారం గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ”రష్యా-ఉక్రెయిన్ సమస్యలో మేము అన్ని వర్గాలతో టచ్లో ఉన్నాము. అన్ని వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలనేది మా వైఖరి. వివాదాలకు శాంతియుత పరిష్కారాలు ఉండాలని మేము విశ్వసిస్తున్నాము. శాంతిని నెలకొల్పడానికి సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది” అని ప్రధాని మోడీ అన్నారు.
ఈ సమావేశంలో ”కజాన్ డిక్లరేషన్” ఉండబోతోంది. బ్రిక్స్లోని సభ్యులు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా నేతలు ఈ సమయంలో కలుసుకోనున్నారు. ఈ ఏడాది మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి రష్యాకు వెళ్లారు. జూలై నెలోల 22వ భారత్-రష్యా వార్షిక సదస్సుకు హాజరయ్యారు. ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్రమోడీకి క్రెమ్లిన్లో రష్యా అత్యున్నత పౌర పురస్కారం ” ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్” పురస్కారంతో సత్కరించింది.