Modi – Natu Natu : ఈ ఏడాది ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగిందని ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. ‘ఎలిఫెంట్ విస్పరర్స్’కు సైతం ప్రతిష్ఠాత్మక అవార్డు రావటంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందన్నారు. 2023 సంవత్సరంలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చూపారని కొనియాడారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్లో 111 పతకాలతో సత్తాచాటారని తెలిపారు. వన్డే ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు గెలుచుకుందని కితాబిచ్చారు. ఈసందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు(Modi – Natu Natu) చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రయాన్-3 విజయవంతంపై చాలా మంది తనకు సందేశాలు పంపుతున్నారని మోడీ తెలిపారు. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించామన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు ఈ సంవత్సరంలోనే ఆమోదం లభించిందని గుర్తుచేశారు. అయోధ్య రామ మందిరంపై దేశం మొత్తం ఉత్సుకతతో ఉందని చెప్పారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడు, అయోధ్యపై కొత్త పాటలు, భజనలు, కవితలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. వాటిలో కొన్నింటిని తాను సోషల్ మీడియాలో షేర్ కూడా చేశానని పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో కళాప్రపంచం తనదైన శైలిలో భాగస్వామ్యం అవుతోందని అభిప్రాయపడ్డారు. అలాంటి సృజనాత్మకను సోషల్ మీడియాలో ‘#శ్రీరామభజన్’తో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు.
మన్ కీ బాత్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. 56 ఏళ్ల వయస్సులో ఉన్న అక్షయ్ పాటిస్తున్న ఫిట్నెస్ విధానాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పాటిస్తున్న పద్ధతులను వివరించారు. జిమ్ చేయడం, ఈత కొట్టడం, బ్మాడ్మింటన్ ఆడటం, మెట్లు ఎక్కడం సహా పలు రకాల వ్యాయామాలు చేయడం అక్షయ్ దినచర్యలో భాగంగా ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో అతన్ని మెచ్చుకుంటూ.. శ్రోతలు కూడా అలాంటి ఫిట్నెస్ విధానాలను పాటించాలని సూచించారు.