ఆగస్ట్ 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వైద్య రంగంను ప్రక్షాళన చేసే సమగ్ర పథకాలను ప్రకటించబోతున్నారు. ఆ పథకాల పూర్తి సమాచారం గోప్యంగా ఉంది. ఆ రోజున మోడీ ప్రకటించిన తరువాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం అందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందుబాటు ధరలకు అందించడం ఈ పథకం లక్ష్యమని తెలుస్తోంది. ‘హీల్ బై ఇండియా’ పేరుతో ఒక పథకాన్ని ప్రధాని ప్రకటించనున్నారు. ఈ పథకం కింద దేశీయ వైద్యులను కొంత మందిని విదేశాలకు పంపించి వివిధ చికిత్సల విధానాలపై శిక్షణ ఇప్పించనున్నారు. ‘హీల్ ఇన్ ఇండియా’ అన్నది మరో పథకం. దీని కింద భారత్ లో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడం కేంద్ర సర్కారు ఉద్దేశ్యంగా చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 15న మూడు కీలక ఆరోగ్య పథకాలను ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘పీఎం జన్ ఆరోగ్య యోజన’, ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’, పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్’లను ఒకే పథకం కింద కేంద్ర సర్కారు అమలు చేయనుంది. ‘పీఎం సమగ్ర స్వస్త్య యోజన’ పేరుతో ఈ మూడు పథకాలను సమగ్రంగా కుదించి ఒక పథకం కింద ప్రకటిస్తారని అధికార వర్గాల సమాచారం. మొత్తం మీద దేశ వైద్య రంగాన్ని సమూలంగా మార్పు చేయడానికి అవసరమైన మూడు పథకాలను ప్రధాని ఆగస్ట్ 15న భారత ప్రజలకు గిఫ్ట్ గా ప్రకటించబోతున్నారు.