PM Modi : గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియగానే కన్యాకుమారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుపెట్టిన మెడిటేషన్ ఇవాళ మధ్యాహ్నంతో ముగిసింది.మొత్తంగా 45 గంటల పాటు ఆయన వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానముద్రలో గడిపారు. ధ్యానం సమయంలో ప్రధాని మోడీ కేవలం ద్రవ పదార్థాలు తీసుకున్నారు. 45 గంటల పాటు మోడీ మౌనంగానే ఉన్నారు. కాషాయ దుస్తులు, జపమాలతో ధ్యాన మండపంలో ధ్యాన ముద్రలో కూర్చున్నారు.
We’re now on WhatsApp. Click to Join
వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోడీ(PM Modi) ధ్యానం చేస్తున్న ఫోటోలు, వీడియోలను ఇటీవల బీజేపీ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధ్యానంలో భాగంగా శుక్రవారం ఉదయం సూర్యోదయ సమయంలో ఆయన సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించారు. ఇవాళ మధ్యాహ్నం ధ్యానం ముగిసిన వెంటనే ప్రధాని మోడీ వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే ఉన్న తమిళ కవి తిరువల్లూరు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
వివేకానంద రాక్ మెమోరియల్ విశేషాలు
- 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారతదేశ ఆధ్యాత్మిక ఖ్యాతిని వివేకానందుడు చాటిచెప్పారు. అందుకు గౌరవ సూచకంగా 1970లో కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ను నిర్మించారు.
- వివేకానంద రాక్ మెమోరియల్ ఉన్న ప్రదేశానికి చాలా ప్రత్యేకత ఉంది. దీనికి వివేకానందుడితో ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడి ధ్యాన శిలపై కూర్చొని ధ్యానం చేసిన తర్వాతే స్వామి వివేకానందుడికి జ్ఞానోదయం కలిగిందని అంటారు.
- వివేకానందుడు జ్ఞానోదయం పొందే వరకు మూడు పగలు, మూడు రాత్రులు రాక్ మెమోరియల్లోని(Vivekananda Rock Memorial) శిలపైనే ధ్యానం చేశారని చెబుతుంటారు.
- నాలుగు సంవత్సరాల పాటు దేశం మొత్తం పర్యటించిన తర్వాత ఇక్కడికి చేరుకొని వివేకానందుడు ధ్యానం చేశారని విశ్వసిస్తారు.
- పురాణాల ప్రకారం.. ఇదే స్థలంలో మాతా కన్యాకుమారి దేవి, శివుడి కోసం తపస్సు చేశారని చెబుతారు. నేటికీ కన్యాకుమారి దేవి పాదాల ముద్ర ఉన్న ప్రదేశాన్ని పవిత్రంగా పూజిస్తారు.