Site icon HashtagU Telugu

PM Modi – Pannun : పన్నూ హత్యకు కుట్ర.. అమెరికా ఆరోపణలపై ప్రధాని ఏమన్నారంటే ?

India US Court Summons Gurpatwant Singh Pannun

PM Modi – Pannun : అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను మర్డర్ చేసేందుకు భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడంటూ అమెరికా సర్కారు చేస్తున్న ఆరోపణలపై తొలిసారిగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు.  ‘‘ఆ ఆరోపణలను పరిశీలిస్తాం.. అయితే కొన్ని సంఘటనల కారణంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు చెడిపోవు’’ అని మోడీ స్పష్టం చేశారు.  ‘‘ఎవరైనా మాకు ఏదైనా సమాచారం అందిస్తే దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం’’ అని వెల్లడించారు. తాజాగా  బ్రిటీష్ దినపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిషయాన్ని తెలియజేశారు. ‘‘మా దేశ పౌరుడు ఏదైనా మంచి లేదా చెడు చేసినట్లయితే.. దాన్ని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాం. చట్టబద్ధమైన పాలనకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని ప్రధాని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

అమెరికా ఆరోపణల ప్రకారం.. అమెరికాలో ఉంటున్న 52 ఏళ్ల నిఖిల్ గుప్తా ఈ ఏడాది మే నుంచే CC-1 అనే కోడ్ నేమ్ కలిగిన భారత ప్రభుత్వ గూఢచార విభాగం అధికారితో టచ్‌లో ఉన్నాడు. తరుచూ వారి మధ్య టెలిఫోనిక్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌ జరిగేది. ఈక్రమంలోనే అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ(PM Modi – Pannun) హత్యకు ప్లాన్ చేయమని నిఖిల్‌కు భారత ప్రభుత్వ అధికారి సూచించారని అమెరికా అంటోంది. ఈ హత్య చేయిస్తే.. భారత్‌లో నిఖిల్‌పై ఉన్న క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవడంలో సాయం చేస్తానని హామీ ఇచ్చారని చెబుతోంది. ఆ తర్వాత నిఖిల్, భారత్‌కు చెందిన గూఢచార అధికారి (CC-1) ఢిల్లీలో వ్యక్తిగతంగా కలుసుకున్నారని అమెరికా నిఘా వర్గాలు అంటున్నాయి. అనంతరం ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు ఒక షూటర్‌ను నిఖిల్ ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆ వ్యక్తి మారువేషంలో ఉన్న అమెరికన్ రహస్య గూఢచార కావడంతో మొత్తం కుట్ర బట్టబయలైందని అమెరికా వాదిస్తోంది.

Also Read: Navy Jobs – 910 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీతో నేవీలో 910 జాబ్స్