PM Modi : 1975 సంవత్సరంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఒక మచ్చగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి రేపటి (మంగళవారం)తో 50 ఏళ్లు పూర్తవుతాయని ఆయన గుర్తు చేశారు. 50ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు రిపీట్ కాకుండా ఉండాలంటే దేశంలోని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. సోమవారం ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రధాని మోడీ(PM Modi) మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు ప్రధాని మోడీ స్వాగతాభినందనలు తెలిపారు. 2047 వికసిత్ భారత్ సంకల్పం, లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు. మూడోసారి దేశానికి సేవచేసే భాగ్యాన్ని కల్పించిన దేశ ప్రజలకు మోడీ థ్యాంక్స్ చెప్పారు. ప్రజలు తమ ప్రభుత్వ విధానాలను విశ్వసించారని తెలిపారు.
‘‘ఈ పార్లమెంటు సమావేశాలను సరికొత్త విశ్వాసంతో మేం మొదలుపెడతాం. రాజ్యాంగం చెప్పే ప్రొటోకాల్స్ను పాటిస్తాం. ప్రజల కలలు సాకారం చేస్తాం. మూడోసారి అధికారంలోకి రావడం వల్ల మాపై మరింత బాధ్యత పెరిగింది’’అని ప్రధాని మోడీ చెప్పారు. ఇక నూతన లోక్సభకు ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.ఇవాళ 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో రేపు ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈనెల 26న స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది.