కైలాస్- మాసనసరోవర్ యాత్రకు వెళ్లే వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. యాత్రికులు ఇకపై మానససరోవర్ వెళ్లాలంటే కారులో వెళ్లొచ్చని కేంద్ర మంత్రి అజయ్ భట్ తెలిపారు. ఘటియాబాగర్ నుంచి లిపులేఖ్ వరకు ఉన్న సరిహద్దు రహదారిని మెటల్ రోడ్డుగా మార్చేందుకు కేంద్రం రూ.60 కోట్లు మంజూరు చేసినందున యాత్రికులు త్వరలో కారులో కైలాష్-మానససరోవర్ను దర్శించుకోవచ్చని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. ఆదివారం పితోర్ఘర్ జిల్లాలోని ఎత్తైన గుంజి గ్రామంలో జరిగిన మతపరమైన ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భట్ మాట్లాడుతూ ఈ రహదారి రక్షణ సిబ్బందికి సరిహద్దు అవుట్పోస్టులకు చేరుకోవడానికి మాత్రమే సహాయపడటమే కాకుండా పర్యాటకులకు కూడా ఉపయోగపడుతుందన్నారు.
పితోర్ఘర్లోని ధార్చుల సబ్డివిజన్లోని వ్యాస్ వ్యాలీలో 10,000 అడుగుల ఎత్తులో కైలాష్-మానససరోవర్ మార్గంలో ఉన్న సరిహద్దు గ్రామం గుంజి.ఇది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అత్యంత అనుకూలమైన సరిహద్దు పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోనుందని ఆయన అన్నారు.ఇండో-చైనా సరిహద్దులో ఉన్న రహదారి స్థానికులు తమ గ్రామాల్లో స్థిరపడేందుకు, ఇతర పర్యాటక సంబంధిత వ్యాపారాలను నిర్వహించడానికి సహాయపడుతుంది అని కేంద్ర మంత్రి తెలిపారు.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ కష్టతరమైన ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసినందుకు ఆ సంస్థను కేంద్ర మంత్రి ప్రశంసించారు.ఈ సంస్థ లడఖ్లో 19,300 అడుగుల ఎత్తులో ఉన్న ఓం లింగ్లా వద్ద సరిహద్దు రహదారిని కూడా నిర్మించారు అని కేంద్ర మంత్రి అజయ్ భట్ గుర్తు చేశారు.