Pannun Murder Plot : అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో పలువురు ఖలిస్థానీ తీవ్రవాదులు యాక్టివ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తాజాగా వార్తల్లో నిలుస్తున్న ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ(Pannun Murder Plot) కూడా అమెరికాలోనే ఉంటున్నాడు. అతడి హత్యకు కుట్ర కేసులో తాజాగా అమెరికాకు షాక్ తగిలింది. అమెరికా దర్యాప్తు సంస్థలకు చెక్ రిపబ్లిక్ దేశం చెక్ పెట్టింది.పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలను ఎదుర్కొంటున్న భారతీయుడు నిఖిల్ గుప్తాను తమకు అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన అమెరికాకు చుక్కెదురైంది. నిఖిల్ గుప్తాను అమెరికా దర్యాప్తు సంస్థల కస్టడీకి ఇవ్వాలంటూ 2024 జనవరి 19న దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును చెక్ రిపబ్లిక్ అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించే విషయంలో ఆలస్యం జరిగితే.. ఎలాంటి ప్రజాప్రయోజనాలు దెబ్బతినవని కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే వరకు ఏమీ చేయలేమని చెక్ రిపబ్లిక్ జస్టిస్ మినిస్టర్ మార్కెటా ఆండ్రోవా వెల్లడించారు. అమెరికా క్రిమినల్ ప్రాసిక్యూషన్ వల్ల నిఖిల్ గుప్తాకే ఎక్కువగా నష్టం జరుగుతోందని కోర్టు పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join
ఈ కేసులో ఏదైనా నిర్ణయానికి వచ్చే వరకు ఫిర్యాదుదారుడైన నిఖిల్ గుప్తా ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా కోర్టు చూస్తుందని పరిశీలకులు అంటున్నారు. చెక్ రిపబ్లిక్- అమెరికా దేశాల మధ్య ఇప్పటికే నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ఉంది. దీంతో గతేడాది జూన్ 30న చెక్ రిపబ్లిక్ రాజధాని నగరం ప్రాగ్లోకి అడుగుపెట్టిన నిఖిల్ గుప్తాను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా పౌరుడు, ఖలిస్థాన్ తీవ్రవాది పన్నూ హత్యకు నిఖిల్ సుపారీ తీసుకున్నాడనే ఆరోపణలు వినవస్తున్నాయి.