గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలన్నీ విమర్శలు, ప్రతివిమర్శలు చేయడంలో బిజీగా మారాయి. ఇందులో భాగంగానే 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లకు బీజేపీ గుణపాఠం చెప్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్లయపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. గుజరాత్ లోని జుహాపురాలో ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఓవైసీ అమిత్ షా పై తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు.
ఓవైసీ మాట్లాడుతూ…నేను కేంద్ర హోంమంత్రికి చెప్పాలనుకుంటున్నాను. 2002లో మీరు నేర్పిన పాఠం ఏమిటో తెలుసా…బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన రేపిస్టులకు మీ ద్వారా విముక్తి లభించడం. మీరు బిల్కిస్ 3 ఏళ్ల కుమార్తె అహ్సాన్ ను చంపిన వారిని విడిపిస్తారు. జాఫ్రీని చంపేస్తారు. మీ పాఠాలన్నింటనీ మేము గుర్తుంచుకుంటాము అంటూ ప్రసంగించారు. హోంమంత్రి గుణపాఠం చెప్పారంటున్నారు. అమిత్ షా సాబ్…ఢిల్లీ మతకల్లోలాలు జరిగినప్పుడు మీరు ఏం పాఠం నేర్పారు అంటూ ట్వీట్ చేశారు.
2002 mein Kaunsa sabaq sikhaya tha @amitshah? Naroda Patiya ka sabaq? Gulberg ka sabaq? Best Bakery ka sabaq? Bilqis Bano ka sabaq? pic.twitter.com/aV3hWC2Ab4
— Asaduddin Owaisi (@asadowaisi) November 25, 2022
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఖేడా జిల్లాలోని మహుధా పట్టణంలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ…రాష్ట్రంలో అల్లర్లకు బీజేపీ గుణపాఠం చెప్పిందన్నారు. అల్లర్లకు పాల్పడినవారు ఇప్పటికీ తలఎత్తేందుకు సాహసించడం లేదు. మా పార్టీ రాష్ట్రానికి శాశ్వత శాంతిని తెచ్చిపెట్టిందని వ్యాఖ్యానించారు. 2002 ఫిబ్రవరిలో గోద్రా రైల్వే స్టేషన్ లో రైలు దహనం ఘటన తర్వాత గుజరాత్ లో కొన్ని ప్రాంతాల్లో పెద్దెత్తున హింస జరిగిన సంగతి తెలిసిందే.