Jammu and Kashmir : జమ్ము కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 9 మంది మంత్రులతో ఒమర్ అబ్దుల్లా కేబినెట్ కొలువుదీరనుంది. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ లు హాజరయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ పదేళ్ల తర్వాత జమ్ములో అధికారంలోకి రావడంతో.. ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాణ స్వీకారానికి ముందు మీడియాతో మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా .. కొత్తగా ఏర్పాటవుతున్న తమ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. జమ్ము కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశాక.. ప్రమాణ స్వీకారం చేస్తున్న తొలి ముఖ్యమంత్రిని తానేనన్నారు. గడిచిన పదేళ్లలో జమ్ము కశ్మీర్ ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.
కాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 29, కాంగ్రెస్ కు 6, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 3, పీపుల్ కాన్ఫరెన్స్ కు 1, సీపీఐ(ఎం) 1 స్థానాల్లో గెలిచాయి. కాగా.. జమ్ము కశ్మీర్ ను కేంద్రంలో ఉన్న బీజేపీ 2019, ఆగస్టు 5న కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. జమ్ము కశ్మీర్, లడఖ్ గా విభజించి రాష్ట్రపతి పాలన విధించింది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల జరిగిన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. నలుగురు స్వతంత్రులు, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.