India: రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి అమెరికా 30 రోజుల పాటు మినహాయింపు ప్రకటించిన నేపథ్యంలో విపక్షాలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తమకు నచ్చిన చోటు నుండి చమురు కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అత్యుత్తమ ధరలను ఆఫర్ చేసే ఏ దేశం నుండైనా భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
భారత ఇంధన సరఫరా సురక్షితం: కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ఇలా పేర్కొంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ భారత ఇంధన సరఫరా సురక్షితంగా, స్థిరంగా ఉంది. భారత్ తన ముడి చమురు వనరులను 27 దేశాల నుండి 40 దేశాలకు పెంచి వైవిధ్యపరిచింది. దీనివల్ల ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, ఎక్కడ తక్కువ ధరలు, పోటీతత్వం ఉంటుందో అక్కడి నుండే భారత్ చమురు కొనుగోలు చేస్తుంది. మన వద్ద ఉన్న అత్యాధునిక రిఫైనరీ సామర్థ్యం కారణంగా వివిధ రకాల ముడి చమురును ప్రాసెస్ చేయడం సాధ్యమవుతోంది. దీనివల్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగదు అని పేర్కొంది.
శనివారం (7 మార్చి 2026) నాడు భారత్ మరో విషయాన్ని ధృవీకరించింది. అమెరికా ఇచ్చిన తాత్కాలిక మినహాయింపుతో సంబంధం లేకుండా రష్యా నుండి చమురు దిగుమతులను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఈ మినహాయింపు ఇవ్వబడింది. అయితే ఇటువంటి కొనుగోళ్ల కోసం భారత్ ఏ దేశం నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.
Also Read: మధ్యప్రాచ్యంలో టెన్షన్.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!
భారత్కు అనుమతి అవసరం లేదు: కేంద్రం
రష్యా చమురును కొనుగోలు చేయడానికి భారత్ ఎప్పుడూ ఏ దేశంపై లేదా వారి అనుమతిపై ఆధారపడలేదు. ఫిబ్రవరి 2026లో కూడా రష్యా నుండి చమురు దిగుమతులు కొనసాగుతాయి. భారత్కు రష్యానే అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగిన మూడేళ్ల కాలంలో అమెరికా- యూరోపియన్ యూనియన్ అభ్యంతరాలను లెక్కచేయకుండా భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. రాయితీ ధరలు, రిఫైనరీ డిమాండ్ కారణంగా 2022 తర్వాత దిగుమతులు గణనీయంగా పెరిగాయని కేంద్రం తెలిపింది.
రష్యాతో వ్యాపారం నిరంతరం కొనసాగుతోంది: కేంద్ర ప్రభుత్వం
మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం కారణంగా గ్లోబల్ ఎనర్జీ ఫ్లో, షిప్పింగ్ మార్గాలకు ఆటంకం ఏర్పడింది. దీనివల్ల చమురు ధరలు పెరిగాయి. సముద్రంలో ఓడల్లో ఉన్న రష్యా చమురును భారత్కు విక్రయించేందుకు వీలుగా అమెరికా గురువారం (5 ఫిబ్రవరి 2026) నాడు రష్యాపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. “రష్యాతో వ్యాపారం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ మినహాయింపు ద్వారా రష్యాతో మా వాణిజ్యాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతోంది. భారత్ ప్రపంచవ్యాప్తంగా రిఫైన్డ్ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఉంది, ఈ పరిస్థితి మా ఇంధన భద్రతను బలహీనపరచదు సరే కదా, మరింత బలోపేతం చేస్తుంది” అని పేర్కొంది.
