Bribe For Vote : సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. లంచాల కేసుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎలాంటి మినహాయింపు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వారు కూడా అందరిలా విచారణను ఎదుర్కోవాల్సిందేనని అని తేల్చి చెప్పింది. 1998 సంవత్సరంలో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును(Bribe For Vote) కొట్టివేస్తూ ఈమేరకు కొత్త తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించింది. చట్టసభల్లో ప్రసంగం లేదా ఓటు వేసేందుకు లంచం పుచ్చుకునే కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపును అప్పట్లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్ధించింది.
We’re now on WhatsApp. Click to Join
తాజాగా సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆనాటి తీర్పుతో విభేదించింది. లంచం కేసుల్లో విచారణ నుంచి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలోని సభ్యులు తప్పించుకోలేరని కుండబద్దలు కొట్టేలా చెప్పింది. 1998లో నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ‘‘మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కేసులో 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మేం విభేదిస్తున్నాం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రకటించారు.
1993 జూలైలో నాటి ప్రధాని పీవీ నర్సింహారావు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆయన ప్రభుత్వం స్వల్ప తేడాతో ఆ అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కింది. అనుకూలంగా 265 ఓట్లు, వ్యతిరేకంగా 251 ఓట్లు పడ్డాయి. ఈ పరిణామం జరిగిన ఒక సంవత్సరం తర్వాత సంచలన కుంభకోణం బయటపడింది. జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలు పీవీ నరసింహారావు ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడానికి లంచాలు పుచ్చుకున్నారనే అభియోగాలు వచ్చాయి. ఈవిషయం చివరకు సుప్రీంకోర్టు దాకా చేరింది. దీనిపై ఆనాడు 1998లో విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది.