No Banners No Bribe : తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం రెడీ చేసిన వ్యూహాన్నికేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా బ్యానర్లు, పోస్టర్లు కనిపించవని స్పష్టం చేశారు. ప్రచారంలో పాల్గొనే వాళ్లకు టీ కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పారు. తనకు ఓటు వేయాలి అనుకునే వాళ్లు కచ్చితంగా వేస్తారని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నాకు లంచం తీసుకోవడం ఇష్టం ఉండదు. ఇంకెవరికైనా ఇచ్చినా ఊరుకోను. కానీ ఓ మాట మాత్రం కచ్చితంగా చెప్పగలను. నిజాయితీగా మీకు సేవ చేస్తాను’’ అని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నేషనల్ హైవే ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి హాజరైన గడ్కరీ ఈ కామెంట్స్ చేశారు.
ఈ ఏడాది జులైలోనూ నితిన్ గడ్కరీ ఇలాంటివే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల సమయంలో ఓ సారి నేను ఓటర్లకు మటన్ ఇచ్చాను. అయినా ఓడిపోయాను. ఎన్నికల్ని ఓటర్ల నమ్మకంతోనే గెలవగలం. ఓటర్లు చాలా స్మార్ట్గా ఉంటున్నారు. అందరు అభ్యర్థులు వాళ్లకు డబ్బులిస్తున్నా.. నచ్చిన వాళ్లకే ఓటు వేస్తారు’’ అని అప్పట్లో ఆయన కామెంట్స్ చేశారు. గడ్కరీ 2014, 2019 లోక్ సభ పోల్స్ లో నాగ్పూర్ (No Banners No Bribe) నుంచి గెలిచారు.