Change In Constitution : కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆయన కామెంట్ చేయడం కలకలం రేపింది. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ స్పందించారు. భారత రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు. హెగ్డే చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని తేల్చి చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘హెగ్డే వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురిచేశాయి. రాజ్యాంగ సవరణలతో కాంగ్రెస్ అనవసరమైన విషయాలను బలవంతంగా చేర్చింది. ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణచి వేయడానికి చట్టాలు తీసుకొచ్చింది. ఇవన్నీ మార్చాల్సి ఉంటుంది’’ అని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ‘‘పార్లమెంటులో బీజేపీకి అత్యధిక మెజారిటీ ఉంది. మూడింట రెండొంతుల మెజారిటీ మా సొంతం. రాజ్యాంగాన్ని మార్చాలంటే(Change In Constitution) మాకు పెద్ద పనేం కాదు. కానీ దానిని మార్చబోం’’ అని ఆయన తెలిపారు.
మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తప్పకుండా మారుస్తామని బీజేపీ ఎంపీ అనంతకుమార్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పందిస్తూ..బీజేపీ రాజ్యాంగ విరోధి అని వ్యాఖ్యానించారు. హెగ్డే వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన బీజేపీ.. దీనిపై వివరణ ఇవ్వాలని హెగ్డేకు ఆదేశాలు జారీ చేసింది. 2017 సంవత్సరంలోనూ హెగ్డే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎంపీలతో ఇదంతా కావాలనే చెప్పిస్తున్నారు : ఖర్గే
బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగ సవరణపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. రాజ్యాంగంలోని లౌకికవాదం, సామాజిక న్యాయానికి అధికార బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని ఆరోపించారు. ఇది మంచి ఆలోచనా విధానం కాదని, దేశంలో ఘర్షణలు సృష్టిస్తుందని చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించడానికే బీజేపీ భారీ మెజారిటీని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. ‘‘బీజేపీ రాజ్యాంగాన్ని ఇంకా పూర్తిగా ఆమోదించలేదని చెప్పడానికి బాధ పడుతున్నాను. ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చబోమని ప్రధాని మోడీ చెబుతున్నారు. కానీ ఆయన పార్టీ వ్యక్తులతో మారుస్తామని చెప్పిస్తున్నారు. మూడింట రెండొంతుల మెజారిటీ వస్తే సవరిస్తామని పార్టీ నేతలు అంటున్నారు. ఇవే వ్యాఖ్యలు మా పార్టీలో ఎవరైనా చేస్తే వారిని కచ్చితంగా తొలగిస్తాను. ఒకవేళ అంబేడ్కర్ను బీజేపీ గౌరవిస్తే, వెంటనే అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి తొలగించాలి. వారికి ఎన్నికల్లో టికెట్లు సైతం కేటాయించకూడదు’’ అని ఖర్గే తెలిపారు.