Rameshwaram Cafe : కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటనపై ఎన్ఐఏ (National Investigation Agency) దర్యాప్తును ముమ్మరం చేసింది. నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ క్రమంలో పేలుడు ఘటనతో సంబంధం ఉన్న అనుమానితుడికి సంబంధించిన కొత్త ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. తాజా ఫొటోల్లో నిందితుడు టీ షర్ట్ ధరించి ముఖానికి మాస్క్తో కనిపించాడు. అతని చేతిలో బ్యాగ్ కూడా ఉంది.
బెంగళూరు(Bangalore)లోని ప్రముఖ రెస్టారెంట్(Restaurant)రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe)లో మార్చి 1 శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ (Bomb Blast) ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్కు వచ్చినట్లు గుర్తించారు. కేఫ్లో పేలుడు జరిగిన గంట తర్వాత అనుమానితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. వీడియోలోని టైమ్స్టాంప్ మార్చి 1న మధ్యాహ్నం 2:03 గంటలకు ఉంది. పేలుడు మధ్యాహ్నం 12:56 గంటలకు జరిగింది. అదే రోజు రాత్రి 9 గంటలకు మరో ఫుటేజీలో అనుమానితుడు బస్ స్టేషన్లో తిరుగుతున్నట్లు గమనించారు. దీంతో ఈ పేలుడు ఘటనలో అతడే ప్రధాన నిందితుడిగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు కూడా ఇస్తామని ఎన్ఐఏ ఇప్పటికే ప్రకటించింది.