NIA Raids : ఉత్తరప్రదేశ్, అసోం, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్రలలోని దాదాపు 22 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇవాళ ముమ్మర సోదాలు నిర్వహించింది. ఉగ్ర దాడులు, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చారనే అభియోగాలతో నమోదైన కేసు విచారణ క్రమంలోనే ఎన్ఐఏ ఈ రైడ్స్ చేసింది. ఆయా అభియోగాలను బలపరిచే ఆధారాలను సేకరించే పనిలో ఎన్ఐఏ ఉంది. ఈ తనిఖీల క్రమంలో ఎన్ఐఏ అధికారులు మహారాష్ట్రలో(NIA Raids) నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Also Read :SEBI Chief : రంగంలోకి కేంద్రం.. సెబీ చీఫ్కు పార్లమెంటరీ కమిటీ సమన్లు
ఎంపీ ఇంజినీర్ రషీద్ అరెస్టుతో మొదలు..
ఉగ్రవాదులకు నిధులను సమకూర్చారంటూ కశ్మీరుకు చెందిన బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్పై 2017లో ఎన్ఐఏ కేసును నమోదు చేసింది. 2019లో ఆయనను అరెస్టు చేసింది. అయితే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇంజినీర్ రషీద్కు సెప్టెంబర్ 10న మధ్యంతర బెయిల్ వచ్చింది. బెయిల్ గడువు అక్టోబర్ 2తోనే ముగిసింది. కశ్మీర్ వేర్పాటువాద సంస్థ నాయకుడు యాసిన్ మాలిక్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్లపై ఎన్ఐఏ ఛార్జీషీట్ దాఖలు చేసింది. అయితే వీరిలో యాసిన్ మాలిక్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడికి 2022లో జీవిత ఖైదు శిక్ష పడింది.
Also Read :Savarkar : వీర సావర్కర్పై వ్యాఖ్యలు.. రాహుల్గాంధీకి పూణే కోర్టు సమన్లు
నిషేధిత తీవ్రవాద సంస్థ కోసం యూట్యూబ్లో ప్రచారం
ఇస్ బత్ తహీర్ పేరిట ఏర్పాటైన నిషేధిత తీవ్ర వాద సంస్థ కోసం యూట్యూబ్ ద్వారా ప్రచారం జరుగుతోందని ఇటీవల చైన్నె పోలీసులు గుర్తించారు. దీంతో ఆ కేసును తమిళనాడు ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. అనుమానితుల నివాసాల నుంచి సీజ్ చేసిన సెల్ఫోన్లు, లెక్కలోకి రాని నగదును ఎన్ఐఏకు తమిళనాడు పోలీసులు అందించారు. ఈనేపథ్యంలో గత నెల (సెప్టెంబర్) 24న తమిళనాడులోని తాంబరం, పుదుక్కొట్టై, కన్యాకుమారి, తంజావూరు, తూత్తుకుడి, తిరుచ్చి, మైలాడుతురై సహా 12 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేసింది. ఇస్ బత్ తహీర్ అనే తీవ్రవాద సంస్థకు మద్దతుగా ప్రచారం చేస్తున్న వారు, ఆ వీడియోలకు లైకులు కొట్టేవారిని గుర్తించి ఎన్ఐఏ తనిఖీలు చేసింది. కాగా, గత నెల (సెప్టెంబరు) 20న పంజాబ్లోని 13 ప్రాంతాల్లోనూ ఎన్ఐఏ రైడ్స్ చేసింది.