New Criminal Laws : జులై 1వ తేదీ నుంచి మన దేశ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. కొత్త నేర న్యాయ చట్టాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. దీంతో బ్రిటీషర్ల కాలంలో అమల్లోకి వచ్చిన చట్టాల వినియోగానికి తెరపడుతుంది.
We’re now on WhatsApp. Click to Join
కొత్త చట్టాలు – కీలక విషయాలు
- కొత్త నేర న్యాయ చట్టాల అమలుతో పోలీసుల దర్యాప్తు ప్రక్రియ ఆధునిక రూపును సంతరించుకోనుంది.
- జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు రూల్స్ అమల్లోకి వస్తాయి.
- ఎస్ఎంఎస్ ద్వారా సమన్లు జారీ, క్రూరమైన నేరాలకు సంబంధించిన దృశ్యాల వీడియోగ్రఫీ వంటి నిబంధనలు అమల్లోకి వస్తాయి.
- ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు.
- రాజద్రోహం అనే పదాన్ని చట్టాల నుంచి తొలగించారు. భారతీయ న్యాయ సంహితలో(New Criminal Laws) రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు.
- క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తైన 45 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుంచి 60 రోజులలోపు అభియోగాలు నమోదు చేయాలి.
- అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. అత్యాచార బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లో రావాలి.
- పిల్లలను కొనడం, విక్రయించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
- మైనర్పై సామూహిక అత్యాచారానికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు.
- భారతీయ శిక్షాస్మృతిలోని 511 సెక్షన్ల స్థానంలో ఇప్పుడు 358 సెక్షన్లు మాత్రమే ఉంటాయి.
- సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలన్నింటినీ జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన డిజీ లాకర్లో భద్రపరుస్తారు. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేయడం వల్ల సాక్ష్యాలను ఆన్లైన్ ద్వారా పంపుతారు.
- ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు.
- పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను విడిచిపెట్టే వారికి కూడా కొత్త చట్టాల్లో కఠిన నిబంధనలు రూపొందించారు.
- జీరో ఎఫ్ఐఆర్ను ప్రవేశపెట్టడం వల్ల ఒక వ్యక్తి అధికార పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీసు స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు.
- కొత్త చట్టాల ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి బాధితులు కేసు పురోగతిపై 90 రోజులలోపు అప్డేట్ పొందేందుకు అవకాశం కల్పించారు.
- క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి.
- ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న స్థిర, చరాస్తులనూ జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.