49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. నవంబరు 9, 1957న జన్మించిన ఆయన జూన్ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబరు 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ యూ యూ లలిత్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా.. న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజుజు.. ఇతర కేంద్ర మంత్రులు.. ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.