India – Cyber Alert : పాకిస్తాన్, ఇండోనేషియాలకు చెందిన పలు హ్యాకర్ గ్రూపులు డిసెంబర్ 11న ‘సైబర్ పార్టీ’ని ప్రకటించాయి. తమ హ్యాకర్ గ్రూపులలోని దాదాపు 4వేల మంది నిపుణులు సోమవారం రోజు భారత ప్రభుత్వానికి చెందిన డిజిటల్ మౌలిక సదుపాయాల(వెబ్ సైట్స్, యాప్స్)పై సైబర్ ఎటాక్స్ చేస్తాయని వెల్లడించాయి. పాక్, ఇండోనేషియాలకు చెందిన హ్యాకర్ గ్రూపులు సమన్వయంతో ఈ దాడులు చేస్తాయని ఒక టెలిగ్రామ్ ఛానల్ వేదికగా తెలిపాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈనేపథ్యంలో మన దేశంలో సైబర్ అలర్ట్ ప్రకటించారు. భారత ప్రభుత్వ వెబ్సైట్లను సైబర్ హైజీన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SoPs)కి కట్టుబడి నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. పోర్టల్స్, యాప్స్ హ్యాకింగ్ ముప్పు బారినపడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని సంబంధిత డిజిటల్ అసెట్స్ను నిర్వహించే విభాగాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆరోగ్య రంగం యొక్క సైబర్ మౌలిక సదుపాయాలను హ్యాకర్లు ప్రధాన లక్ష్యంగా మార్చుకునే రిస్క్ ఉందని కేంద్ర నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
భారత్లోని 12వేల ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేస్తామని పాకిస్తాన్, ఇండోనేషియాలకు చెందిన హ్యాకర్ గ్రూపులు గతంలోనూ ఒకసారి వార్నింగ్ ఇచ్చాయి. అమెరికా, స్వీడన్, ఇజ్రాయెల్ వంటి దేశాలపైనా సైబర్ ఎటాక్స్ చేసిన చరిత్ర వాటికి ఉంది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల వంటి ఘటనల నేపథ్యంలో మతపరమైన కారణాలతో పాకిస్తాన్, ఇండోనేషియాలకు చెందిన హ్యాకర్ గ్రూప్లు కలిసికట్టుగా ఈ సైబర్ ఎటాక్స్కు ప్లాన్ చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గతంలో స్వీడన్కు చెందిన సోషల్ మీడియా వినియోగదారుల డేటాను ఈ హ్యాకర్లు లీక్ చేశారు. ఇజ్రాయెల్కు సంబంధించిన ఆరోగ్య విభాగం, సోషల్ మీడియా సమాచారాన్ని దొంగిలించారు. అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న ఒక పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించిన డేటాను లీక్(India – Cyber Alert) చేశారు.