గవర్నమెంట్ నౌకరి ఉన్న వాళ్లకు పెన్షన్ ఎలాగూ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత వాళ్లకు ఆర్థికంగా ఏదో ఒక భరోసా కూడా ఉంటుంది. కానీ రెక్కలు ముక్కలు చేసుకుని ఏండ్లు పనిచేసి.. వయస్సు మీదపడిన ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితే కష్టం. పని చేయడం ఆగితే.. నెలనెలా వచ్చే జీతమూ ఆగుతుంది. అలాగని ఖర్చులు మాత్రం ఆగవు కదా?.. అయితే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు, చిరు వ్యాపారస్తులకు కూడా నెలనెలా పెన్షన్ పొందే వీలు కల్పిస్తోంది ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్). దీని ద్వారా రిటైర్మెంట్ వయసు తర్వాత ప్రతినెలా రూ.50,000 వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏంటీ ఎన్పీఎస్..
ఎన్పీఎస్ అనేది కేంద్ర ప్రభుత్వ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. కాబట్టి ఇందులో పెట్టిన పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పొదుపు పథకాన్ని నిర్వహిస్తున్నాయి.రిటైర్మెంట్ కోసం ముందు నుంచే దాచుకునే సౌలభ్యాన్ని కల్పించడానికి ఏర్పాటైందే ఈ ఎన్పీఎస్. ఇందులో ఎవరైనా క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టి రిటైర్మెంట్ వయస్సు తర్వాత నెలనెలా కొంత మొత్తాలను ఇక్కడ తీసుకోవచ్చు.
రూ.50 వేలు.. నెలకు ఇలా..
ఒక వ్యక్తి వయస్సు ఇప్పుడు 30 ఏండ్లు అనుకుందాం. తను నెలనెలా రూ.5 వేలు ఎన్పీఎస్కు జమ చేస్తున్నాడు. 65 ఏండ్లు వచ్చేదాకా చెల్లించడానికి సిద్ధం. అంటే 35 ఏండ్లు పెట్టుబడి పెడతాడన్నమాట. ఇక ఈ పెట్టుబడులపై ఏటా కనీసం 10 శాతం రాబడి వస్తుందని ఆ వ్యక్తి ఆశిస్తున్నాడు . తనకు 65 ఏండ్లు వచ్చేనాటికి తాను పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.27.30 లక్షలు. కానీ అది లాభంతో రూ.2.48 కోట్లు అవుతుంది. అయితే ఈ మొత్తం తీసుకోవడానికి అవకాశం ఉండదు. 40 శాతం యాన్యుటీని కొనుగోలు చేసి దానిపై కనీసం 7 శాతం ఆదాయాన్ని ఆశించవచ్చు. ఈ లెక్కన అప్పుడు నెలనెలా రూ.58వేల పెన్షన్ అందుతుంది. అంతే కాదు రూ.99.53 లక్షల మొత్తం లంప్సమ్గా కూడా వస్తుంది.తక్కువ వయస్సులో ఎన్పీఎస్లో పెట్టుబడిని ప్రారంభిస్తే.. చాలాకాలం చెల్లిస్తూపోవాలి. సెక్షన్ 80సీ, 80సీసీడీ(1), (2) కింద గరిష్ఠంగా రూ.2 లక్షల రూపాయల వరకూ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపును పొందవచ్చు.