5 Poll Promises : లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ మహిళలకు ప్రత్యేకంగా ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పేద కుటుంబాల్లోని మహిళలకు ఏటా రూ.లక్ష నగదును బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా చేపట్టే నియామకాల్లో నారీమణులకు 50శాతం కోటా ఇస్తామని తెలిపింది.‘నారీ న్యాయ్’ పేరుతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ హామీని ప్రకటించారు. మహారాష్ట్రలో ‘భారత్ జోడో న్యాయ్యాత్ర’లో పాల్గొంటున్న రాహుల్ గాంధీ కూడా నారీ న్యాయ్ గ్యారంటీకి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో మొత్తం ఐదు గ్యారెంటీలను(5 Poll Promises) కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
మహాలక్ష్మి పథకం కింద ప్రతీ పేద కుటుంబం నుంచి ఒక మహిళకు ఏటా రూ.లక్ష నగదును నేరుగా బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తారు.
ఆదీ ఆబాదీ-పూరా హక్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.
శక్తి కా సమ్మాన్ పథకంలో భాగంగా ఆశా, అంగన్వాడీలు, మధ్యాహ్నభోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటాను రెట్టింపు చేస్తారు.
‘అధికార్ మైత్రీ’ స్కీంలో భాగంగా న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి, వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక అధికార్ మైత్రీని నియమిస్తారు.
ఉద్యోగం చేసే మహిళల కోసం అందుబాటులో ఉన్న హాస్టళ్లను రెట్టింపు చేస్తారు. ప్రతీ జిల్లాలో కనీసం ఓ సావిత్రీబాయి పూలే హాస్టల్ ఏర్పాటు చేస్తారు.
‘‘మా పార్టీ ఇస్తున్న ప్రతిహామీనీ నెరవేరుస్తుంది. మేం బూటకపు వాగ్ధానాలు చేయబోం. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో మేనిఫెస్టొల్లో చేర్చిన అన్ని హామీలను నెరవేర్చాం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే క్రమంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ను ఆశీర్వదించాలి. బీజేపీ దేశంలోని నిరుద్యోగులను పట్టించుకోలేదు’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.