CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తనను విచారించేందుకు గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వడంపై సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాజా పరిణామాలపై సీఎం మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదన్నారు. గవర్నర్ నిర్ణయం తననేమీ ఆశ్చర్యపరచలేదన్న ఆయన.. రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు తనలో మరింత జోష్ పెరుగుతుందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలేదు. భవిష్యత్తులోనూ చేయను. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ, జేడీఎస్లు కుట్ర పన్నాయి అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆగస్టు 17, 1984లో తొలిసారి మంత్రి పదవి చేపట్టిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన.. తన రాజకీయ జీవితంలో ఒక్క మరక కూడా లేదన్నారు. తనపై విచారణ చేయాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయంగా ప్రేరేపితమైనవన్నారు. వాటిని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు.
కాగా, న్యాయపోరాటం చేస్తాం. రాజకీయంగానూ పోరాడతాం. రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తా. ఇటువంటివి నిరంతరం ఎదుర్కొంటూనే ఉన్నా అని కర్ణాటక సీఎం పేర్కొన్నారు. తనను రాజకీయంగా నాశనం చేస్తే కాంగ్రెస్ మొత్తం నాశనమవుతుందనే భ్రమలో విపక్షాలు ఉన్నాయని బీజేపీని ఉద్దేశించి అన్నారు. మరోవైపు మహారాష్ట్ర, ఝార్ఖండ్, దిల్లీల మాదిరిగా కర్ణాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ‘ముడా’ వ్యవహారంలో విచారణ కోసం రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.
Read Also: Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం కూతురి గౌను.. ఒక దర్జీ.. రసవత్తర కిడ్నాప్ స్టోరీ !