Trinamool Congress పశ్చిమ బెంగాల్కు హాని తలపెట్టే ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తే, ఆ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాణిగంజ్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు.
పశ్చిమ బెంగాల్లో విజయం సాధించిన అనంతరం ఢిల్లీని కూడా స్వాధీనం చేసుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలను ఏకం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వారు బుల్డోజర్లను ఉపయోగించి అందరినీ బయటకు గెంటివేస్తారని హెచ్చరించారు. బెంగాల్కు నష్టం చేసే ప్రయత్నం చేస్తే బీజేపీ జాతీయస్థాయిలో దెబ్బతింటుందని అన్నారు.
‘ఎస్ఐఆర్’ ప్రక్రియ పేరుతో ఓటర్ల జాబితా నుంచి కొన్ని పేర్లను తొలగించడం ద్వారా ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ తమ గెలుపు కోసం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు.
రాణిగంజ్లోని పర్వత ప్రాంతాల్లో తరచూ కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకర ప్రాంతాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేవారికి తమ ప్రభుత్వం గృహవసతితో పాటు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుందని హామీ ఇచ్చారు.
