Site icon HashtagU Telugu

Modi’s Biggest Warning : భారత్ వైపు కన్నెత్తి చూస్తే వినాశనమే..పాక్ కు మోడీ వార్నింగ్

Modispeech

Modispeech

అదంపూర్ ఎయిర్‌బేస్‌(Adampur Airbase)లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (Modi) చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ (Pakistan) దూకుడు, ఉగ్రవాద మద్దతు చర్యలను తీవ్రంగా విమర్శించిన ఆయన, భారత్‌ను కుదించే ప్రయత్నాలు చేసే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. “భారత్ వైపు కన్నెత్తి చూస్తే వినాశనమే” అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి దేశాలకు బలమైన హెచ్చరికగా నిలిచాయి. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్‌ను కూడా భారత్ ఉపేక్షించదని, అణు ఆయుధాల బెదిరింపులకు తలొగ్గేది లేదని తెలిపారు.

Bajaj Gogo : బజాజ్ గోగోను విడుదల చేసిన బజాజ్ ఆటో

భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై చేసిన ప్రత్యుత్తరం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. “కేవలం 25 నిమిషాల్లో మన వాయుసేన శత్రుదేశంలోని ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది. పౌరుల ప్రాణాలకు హాని కలగకుండా మన జవాన్లు అత్యంత సంయమనం చూపారు,” అని పేర్కొన్నారు. శత్రు దేశ విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొనడాన్ని ఆయన అభినందించారు.

“మన సైన్యం నట్టింట్లోకి వెళ్లి శత్రు స్థావరాలను మట్టుబెట్టింది” అని మోదీ గర్వంగా తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత జవాన్లు చూపిన ధైర్యం, త్యాగం తనను గర్వపడేలా చేసిందన్నారు. “మన సైనికులు యుద్ధభూమిలో ‘భారత మాతాకీ జై’ నినాదాలతో ముందుకు సాగారు. వారి శౌర్యం చూసి నా జన్మ ధన్యమైంది” అని మోదీ గర్వంగా చెప్పారు. ఇది భారత తలకెత్తిన తేజాన్ని, సైన్యం ప్రతిభను ప్రపంచానికి మరోసారి చాటిందన్నారు.