Modi-Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారు 40 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించారు. పీటీఐ నివేదిక ప్రకారం.. యూఎస్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ఇరువురు నేతల మధ్య జరిగిన మొదటి ఫోన్ కాల్ ఇదే. ట్రంప్ స్వయంగా ప్రధాని మోదీకి ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఇరువురు నేతలు చర్చించారు.
ట్రంప్తో సంభాషణ అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (X) లో ఇలా రాశారు. నా స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి ఫోన్ వచ్చింది. వివిధ రంగాలలో మన ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని మేము సమీక్షించాము. అన్ని రంగాలలో మన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము పశ్చిమ ఆసియాలోని పరిస్థితుల గురించి కూడా మాట్లాడుకున్నాము. ‘హోర్ముజ్ స్ట్రెయిట్’ (Hormuz Strait)ను తెరిచి ఉంచడం, సురక్షితంగా ఉంచడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పాము అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ కాల్ సందర్భంగా ప్రధాని మోదీ ట్రంప్తో.. “భారత ప్రజలు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు” అని అన్నారు.
Also Read: Cognizant : ఏఐ రంగంలో యువతకు అదిరిపోయే ఛాన్స్..
భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ని ఉటంకిస్తూ ఎన్డీటీవీ పేర్కొన్న సమాచారం ప్రకారం.. ఈ సంభాషణలో ఇద్దరు నేతలు మధ్యప్రాచ్య పరిస్థితులు, వాణిజ్యంపై చర్చించారు. “అధ్యక్షుడు ట్రంప్ క్రమం తప్పకుండా ప్రధాని మోదీకి అప్డేట్స్ ఇస్తుంటారు. మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతుందో వివరించడంతో పాటు, వాషింగ్టన్లో అమెరికా-భారత్ మధ్య జరుగుతున్న కొన్ని కీలక పరిణామాల గురించి కూడా చర్చించారు” అని గోర్ తెలిపారు. ప్రధాని మోదీ, ట్రంప్ దీనికి ముందు ఫిబ్రవరి 2న వాణిజ్య ఒప్పందంలో పురోగతిని సమీక్షించడానికి మాట్లాడారు. ఆ తర్వాత మార్చి 24న పశ్చిమ ఆసియా పరిస్థితులపై చర్చించారు.
