అదానీ వ్యవహరంతో దేశంలోనే కాదు.. పార్లమెంట్ లో కూడా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగానికి (Presidents Address) ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లోక్సభ లో సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసిందని మోదీ చెప్పారు. నిన్న సభలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారని, అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారని మోదీ సెటైర్ వేశారు.
ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారని, నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని మోదీ (PM Modi) చెప్పారు. గతంలో తన సమస్యల పరిష్కారం కోసం భారత్ ఇతరులపైన ఆధారపడేదని, నేడు భారతే ఇతర సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. నేడు భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోందని మోదీ చెప్పారు. ఇది కొంతమందికి కంటగింపుగా ఉండొచ్చని, తనకైతే గర్వంగా ఉందని ప్రధాని చెప్పారు. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కొందరు నిరాశలో మునిగిపోయి దేశ విజయాలను సహించలేకపోతున్నారని మోదీ (PM Modi) చెప్పారు.
నేడు అనేక దేశాలను (Countries) నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయని, భారత్ మాత్రం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందన్నారు. భారత్లో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మోదీ చురకలు వేశారు. దర్యాప్తు సంస్థలను విపక్షాలన్నీ కలిసి విమర్శలు చేస్తున్నాయని మోదీ సెటైర్ వేశారు. ఈడీ దెబ్బకు ప్రతిపక్షనాయకులంతా ఏకతాటిపైకి వచ్చారన్నారు. తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశానని, ప్రజలకు తనపై విశ్వాసం ఉందని, అది విపక్షాలకు అందదని ప్రధాని చెప్పారు. తాను 25 కోట్ల కుటుంబాల సభ్యుడిని, కొందరు ఒకే కుటుంబానికి సేవ చేశారని, తాను 25 కోట్ల కుటుంబాలకు సేవ చేస్తున్నానని మోదీ చెప్పారు. నన్ను ఎవరూ టచ్ చేయలేరని, నా చుట్టు బలగాలు ఉన్నాయని మోడీ అన్నార.