Site icon HashtagU Telugu

Old Cars – MLAs : ఎమ్మెల్యేలు, మంత్రులకు పాత కార్లే.. కొత్తవి కొనేది లేదు : సీఎం

Old Cars Mlas

Old Cars Mlas

Old Cars – MLAs : ‘‘ప్రజా ధనాన్ని వృథా చేయలేం.  ప్రజా ధనంతో  ఎమ్మెల్యేలకు, మంత్రులకు కొత్త కార్లను కొనలేం’’  అని మిజోరం కొత్త సీఎం, జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పీఎం) పార్టీ అధ్యక్షుడు లాల్‌దుహోమా ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఉపయోగించిన కార్లనే(Old Cars – MLAs) వాడుకోవాలని అందరికీ సూచించారు. మిజోరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు కల్పించిన సౌకర్యాలతో పోలిస్తే తాము దాదాపు 50 శాతం తగ్గించుకుంటామని సీఎం లాల్ దుహోమా ప్రకటించారు. మిజోరంను అవినీతి రహితంగా మార్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే నమోదైన అవినీతి కేసులపై సీబీఐతో విచారణ జరిపిస్తామని చెప్పారు.ఇక  రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని వెల్లడించారు. పసుపు, చెరకు, మిరప, వెదురు వంటి పంట ఉత్పత్తులను రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా కొని కనీస మద్దతు ధరను చెల్లిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పంటలను ప్రభుత్వానికే విక్రయించాలన్న నిబంధనలను ఏమీ లేవని.. ప్రైవేటు వ్యక్తులెవరైనా ఎక్కువ ధర చెల్లిస్తే వారికైనా అమ్ముకోవచ్చన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మిజోరం రాష్ట్ర అభివృద్ధి కోసం 12 అంశాలను గుర్తించామని సీఎం లాల్ దుహోమా చెప్పారు. వాటిని అమలు చేసేందుకు ఏర్పాటు చేసే కమిటీలో ప్రభుత్వంతోపాటు గుర్తింపు పొందిన పార్టీల నాయకులు, ఎన్జీవోలు, మత సంఘాలు, మిజోరం పీపుల్స్‌ ఫోరం సభ్యులు ఉంటారని తెలిపారు. పొదుపు చర్యలు, పెట్టుబడుల ఉపసంహరణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. కాంట్రాక్టర్లు చేసే ప్రభుత్వ పనుల్లో నాణ్యత లోపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో సిబ్బంది సమయానికి రావాలని.. బయోమెట్రిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Also Read: Panchayat Elections : ‘పల్లె సమరం’.. కొత్త పంచాయతీల సంగతేంటి ? రిజర్వేషన్లు పెంచుతారా ?