యూపీలో దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికను కారు డ్రైవర్ కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు గంగానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం తన కుమార్తె బయటికి వెళ్లగా.. దారిలో తనను ఎవరో కారులో తీసుకెళ్లారని, ఆపై గంట తర్వాత రోడ్డుపై పడవేశారని బాధిత బాలిక పోలీసులకు వెల్లడించింది. అయితే తన కూతురిపై అత్యాచారం జరిగిందని బాలిక తల్లి ఆరోపించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో సీసీటీవీ కెమెరా ఫుటేజీల ద్వారా ఘటనకు సంబంధించి చాలా సమాచారం సేకరించినట్లు పోలీసులు తెలిపారు. కారు తలుపు తెరిచిన తర్వాత అమ్మాయి కారులో కూర్చున్నట్లు ఫుటేజీ ఉందని పోలీసులు వెల్లడించారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించి, నివేదిక రాగానే అత్యాచారం జరిగిందో లేదో తెలుస్తుందని, కారు డ్రైవరు ఎవరనేది త్వరలోనే కనిపెడతామని పోలీసులు తెలిపారు. ఉదయం 9 గంటలకు తన కూతురు డివైడర్పై పడి ఉన్నట్టు సమాచారం అందిందని బాలిక తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కూతురిని అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చానని..జరిగిన విషయాన్ని తన కూతురు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది.