ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. భోజనం ఆలస్యం చేసిందనే కారణంతో 21 ఏళ్ల తన కుమార్తెను ఓ వ్యక్తి హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్ ఫరియాద్ (55) అనే వ్యక్తి తన కూతురు రేష్మ భోజనం వడ్డించడంలో ఆలస్యం చేసిందని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగి మహ్మద్ ఫరియాద్ కోపంతో గడ్డి కోసేందుకు ఉపయోగించే పదునైన బ్లేడ్ని తీసుకుని తన కుమార్తెను కొట్టినట్లు తెలుస్తోంది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ ముఖేష్ చంద్ర మాట్లాడుతూ బాబుగర్ పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. మృతదేహాన్ని కూడా పోస్టుమార్టంకు తరలించారు. విచారణ కొనసాగుతోందని.. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని తెలిపారు. అయితే మృతురాలి వివాహం సెప్టెంబర్ 4న జరగనుంది. ఈ లోపే తన తండ్రి చేతిలో హత్య కావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.