Bengal BJP Protest:బెంగాల్ బీజేపీ లీడ‌ర్ల‌పై `టియ‌ర్ గ్యాస్‌`

బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌కు వ్య‌తిరేకంగా బీజేపీ నిర్వ‌హించిన `చ‌లో స‌చివాల‌యం` పిలుపు సంద‌ర్భంగా కోల్ క‌తాలోని ప‌లు ప్రాంతాల్లో టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించ‌డం ద్వారా ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు చెద‌ర‌గొట్టారు.

Published By: HashtagU Telugu Desk
Bengal Bjp

Bengal Bjp

బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌కు వ్య‌తిరేకంగా బీజేపీ నిర్వ‌హించిన `చ‌లో స‌చివాల‌యం` పిలుపు సంద‌ర్భంగా కోల్ క‌తాలోని ప‌లు ప్రాంతాల్లో టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించ‌డం ద్వారా ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు చెద‌ర‌గొట్టారు. రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’కు మార్చ్ చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారితో సహా పలువురు బిజెపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సువేందు అధికారి, బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ, రాహుల్ సిన్హా సహా ఇతర పార్టీ నేతలను సెక్రటేరియట్ సమీపంలోని రెండో హుగ్లీ వంతెన వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకుని జైలు వ్యాన్‌లో తీసుకెళ్లారు.

హౌరా బ్రిడ్జి దగ్గర ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ , వాటర్ కానన్‌లను ప్రయోగించారు, ఆందోళ‌న‌కారులు భద్రతా అధికారులతో ఘర్షణ పడ్డారు. మహిళలు సహా పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాణిగంజ్‌లోనూ పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ను మ‌రో ఉత్తర కొరియాగా మార్చారని బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఉత్తర కొరియా తరహాలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం “ప్రజాస్వామ్య నిరసన”ని బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తోందని రాహుల్ సిన్హా అన్నారు. నిరసన కవాతులో పాల్గొనేందుకు అలీపుర్‌దూర్‌ నుంచి సీల్దా వరకు ఉన్న ప్రత్యేక రైలు ఎక్కకుండా బీజేపీ మద్దతుదారులను అడ్డుకున్నారని ఆరోపించారు. వారిపై రాష్ట్ర పోలీసులు లాఠీచార్జి కూడా చేశారని ఆయన ఆరోపించారు.

  Last Updated: 13 Sep 2022, 03:15 PM IST